షిండే వర్గానికి ఎన్నికల గుర్తును కేటాయించిన ఈసీ

షిండే వర్గానికి ఎన్నికల గుర్తును కేటాయించిన ఈసీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి ఎలక్షన్ కమీషన్ ఎన్నికల గుర్తును కేటాయించింది. రెండు కత్తులు, షీల్డ్ ఉన్న గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీకి ఎన్నికల సంఘం పార్టీ చిహ్నంగా కాగడ (మషాల్) ను కేటాయించింది.

రెండుగా చీలిపోయిన శివసేన పార్టీకి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పేర్లను కేటాయించింది. సీఎం ఏక్‭నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహేబాంచి శివసేన’ అని, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పేరును కేటాయించింది. అంతకుముందు, రెండు వర్గాలు ప్రతిపాదించిన గదా, త్రిశూలం మతపరమైన చిహ్నాలు కావడంతో ఎన్నికల సంఘం వాటిని తిరస్కరించింది. ముంబైలోని ఈస్ట్ అంధేరీ నియోజకవర్గంలో నవంబర్ 3న జరగనున్న ఉపఎన్నిక కోసం కొత్త పేర్లు, గుర్తులను ఎంచుకోవలసిందిగా  భారత ఎన్నికల సంఘం ఠాక్రే, షిండే వర్గాలను కోరింది.

శివసేన ఎమ్మెల్యే రమేష్ లాత్కే ఆకస్మిక మృతితో ఈస్ట్ అంధేరి అసెంబ్లీ నియోజకవర్గానికి బై పోల్ వచ్చింది. బై పోల్ కోసం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం నుంచి రమేష్ లాత్కే భార్య రుతుజ పోటీ చేస్తున్నారు. ఇక ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ముర్జీ పటేల్ పేరును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు.