అక్టోబర్ 10లోగా ఎన్నికల షెడ్యూల్

అక్టోబర్ 10లోగా ఎన్నికల షెడ్యూల్

నిర్మల్, వెలుగు: అక్టోబర్ 10వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని  రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జడ్పీ చైర్ పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమిష్టి కృషితోనే నిర్మల్ జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.  అధికారులు ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు జడ్పీటీసీలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు. వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సమావేశంలో  ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ విటల్, కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, పలువురు అధికారులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

శోభాయాత్రను  ప్రశాంతంగా జరుపుకోవాలి

గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గణేశ్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పూర్తి చేశారన్నారు. బంగల్ పేట్ వినాయక సాగర్ వద్ద నిమజ్జనం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గజ ఈతగాళ్లను, క్రేన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, లైబ్రరీ చైర్మన్ రాజేందర్, ఉత్సవ సమితి కన్వీనర్ రాజేందర్, అయ్యన్న గారి భూమయ్య, డీఎస్పీ గంగారెడ్డి పాల్గొన్నారు.