ఎన్నికల బాండ్లా? అవినీతి బాండ్లా?

ఎన్నికల బాండ్లా? అవినీతి బాండ్లా?

 ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు దేశ పాలకులకి, బడా పెట్టుబడిదారులకు మధ్య బంధాన్ని బయటపెట్టింది.  ప్రజాస్వామ్య పాలన పోయి, పెట్టుబడిదారుల వల్లనే మన ఎన్నికల (అ)ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. కేంద్రంలోని అధికార బీజేపీకి కార్పొరేట్ కంపెనీలు అంతులేని ప్రేమతో రూ.8,200 కోట్లు ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ కు రూ.1,397 కోట్లు ఇచ్చారు. జాతీయ కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్ళింది. బీఆర్​ఎస్, వైసీపీలు విరాళాల్లో జాతీయ పార్టీలతో పోటీపడ్డాయి.  వర్గ శత్రువులైన కమ్యూనిస్టు పార్టీలకు సహజంగానే పెట్టుబడిదారులు పైసా ఇవ్వలేదు. 

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.584 కోట్లు బీజేపీకి ఎన్నికల విరాళాలుగా ఇచ్చింది.  అలాగే బీఆర్ఎస్​కు రూ.195 కోట్లు ఇచ్చింది. కూలుతున్న కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ  ప్రాజెక్టుల పేరిట తెలంగాణను ఏడు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చి, మేఘా కంపెనీ వందల కోట్ల అతి పెద్ద వాటా బీజేపీకి, బీఆర్ఎస్ కు విరాళాలు ఇచ్చింది.   మేఘా కంపెనీ 1,186 కోట్ల ఎన్నికల బాండ్లని కొంటే, అందులో బీజేపీకే  రూ.584 కోట్లు ఇచ్చింది.  మొత్తం ఎన్నికల బాండ్ల  కుంభకోణంలో 60 శాతం లాభపడింది బీజేపీ మాత్రమే.

ఎస్బీఐ సమాచారం ప్రకారం 38 బడా కంపెనీలకు 179  ప్రభుత్వ  కాంట్రాక్టులు, వాటి విలువ రూ. 3.8 లక్షల కోట్లు.  62 వేల కోట్ల  కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాల కాంట్రాక్టులు పొందిన తర్వాత రూ. 580 కోట్ల బీజేపీ ఎన్నికల బాండ్లు కొన్నారు. బాండ్ల కొనుగోలుదారుల జాబితాలో 18,871 ఎంట్రీలు అయితే పార్టీల జాబితాలో 20,421.  రెండు జాబితాలలోను సరిపోలిన బాండ్లు 18,741.  వాటి విలువ 12,145.88 కోట్లు. కానీ,  గత ఐదేండ్లలో జారీ అయిన  మొత్తం బాండ్ల విలువ 12,769 కోట్లు.  మొత్తం బాండ్లలో 623 కోట్ల తేడా వస్తుంది. ఇందులో అత్యధికం బీజేపీకి వెళ్లాయి. బీజేపీకి రూ.466.5 కోట్లు ఎవరు ఇచ్చారో తెలియని రహస్య బడా పెట్టుబడిదారులు ఉన్నారు.  ఎస్బీఐ ఇంకా సమాచారం దాస్తోంది.
  
బడా కంపెనీల కబంధ హస్తాల్లో ప్రభుత్వాలు

రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో సగానికి సగం కేవలం 23 కంపెనీల నుంచి అందాయి. లాటరీ కింగ్ మార్టిన్  13 రాష్ట్రాల్లో రోజూ జనాన్ని భారీ ఎత్తున దోచుకుంటూ, ఈడీ దాడులు జరగగానే అదే నెలలో బీజేపీకి రూ.100 కోట్ల విరాళాలు ఇచ్చారు.  సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల తీర్పు వల్ల పెట్టుబడిదారులకు, బీజేపీకి మధ్య ఉన్న భారీ అక్రమ బంధం బయటపడింది. 

దీనివల్ల దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఓట్లకి గండిపడుతుందని బీజేపీ గ్రహించింది.  నష్ట నివారణగా సీఏఏ దేశవ్యాప్త అమలుకు అమిత్ షా పిలుపునిచ్చారు.  బీజేపీ  ప్రజల ఆర్థిక సమస్యలు పరిష్కరించకపోగా, వారినే పన్నుల రూపంలో అంతులేని దోపిడీ చేస్తోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన మోదీ వ్యక్తిత్వం నాటి రాముడి వ్యక్తిత్వానికి  సరితూగుతుందా?  

ఈడీ, ఐటీ దాడులు.. బాండ్ల కొనుగోలు

  ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర ఏజెన్సీల దర్యాప్తును ఎదుర్కొంటున్న 41 కంపెనీలు గత ఐదేండ్లలో బీజేపీకి విరాళాల రూపంలో రూ. 2,471 కోట్లు ఇచ్చారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు. ఇందులో  రూ.1,698 కోట్లు ఆ సంస్థలపై దాడులు చేసిన తర్వాత ఇచ్చినవే అన్నారు. దేశవ్యాప్తంగా  రూ.3.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకున్న 33 గ్రూపులు బీజేపీకి రూ.1751 కోట్లు విరాళంగా ఇచ్చారు.  సామాన్య జనాన్ని దోచుకున్న అవినీతి డబ్బు బాండ్ల రూపంలో బీజేపీ ఖాతాలో ఏరులై పారింది. ఓ బడా పెట్టుబడిదారీ కంపెనీ ఒక రాజకీయ పార్టీకి వందల కోట్ల రూపాయలు ఊరికే ఎందుకు ఇస్తుంది? ప్రభుత్వాలు భారీ కాంట్రాక్టులు ఇస్తే, కంపెనీలు ఆపార్టీలకు భారీగా విరాళాలు ఇస్తాయి. ఇదే క్విడ్ ప్రోకో.

దేశ సంపద ధారాదత్తం

దేశంలో ప్రాంతీయ పార్టీల్లో అన్నింటికంటే  బీఆర్ఎస్ సంపద చాలా ఎక్కువ.  రాష్ట్ర ప్రజల ఖజానాను పెట్టుబడిదారులకు కేసీఆర్​ సర్కారు ఊడ్చిపెట్టింది. ప్రతిగా బీఆర్ఎస్​ దేశంలోనే అతిపెద్ద సంపన్న ప్రాంతీయ పార్టీగా మారింది. షేర్ హోల్డర్లకు లాభాల్లో వాటా ఇచ్చారో లేదో తెలియదు కానీ, రాజకీయ పార్టీలకు వందల వేల కోట్లు ఉదారంగా ఇచ్చారు. ఐఎఫ్ బీ (ఆగ్రో) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.400 కోట్లు.  గత ఆర్థిక సంవత్సరంలో దాని ఆదాయం రూ.49 కోట్లు.  ఐదు కోట్ల లాభం వచ్చింది. 

కానీ, అది రాజకీయ పార్టీలకు ఇచ్చినవిరాళాలు రూ.92 కోట్లు. దానికి వచ్చిన లాభం కంటే దాదాపు 19 రెట్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చింది. ఏ కంపెనీ దాని నిజమైన లాభం కంటే 19 రెట్లు అధికంగా విరాళాలు ఇవ్వదు. అంటే లాభం అంతకంటే ఎక్కువే ఉంటుంది. దివిస్ ల్యాబ్ 55 కోట్లు, యునైటెడ్ పాస్పరస్ ఇండియా లిమిటెడ్ 50 కోట్లు, రాజకీయ పార్టీలకు ప్రధానంగా బీజేపీకి విరాళాలు ఇచ్చాయి. 

ఎస్బీఐకి సుప్రీంకోర్టు మొట్టికాయలు

ఎన్నికల బాండ్ల కేసు విచారణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు  మొట్టికాయలు వేస్తే తప్ప ఎస్బీఐ దిగిరాలేదు. బాండ్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాల్సిందేనని, అరకొర సమాచారం ఇస్తే కుదరదని తేల్చి చెప్పింది. కొన్నవారి వివరాలు, స్వీకరించిన వారి వివరాలు, వాటి సంఖ్య కచ్చితంగా ఉండాల్సిందేనని  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.  ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేయాలని అసోచామ్, ఫిక్కి, సిఐఐ వేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.  

ముకుల్ రోహిత్గి వాదిస్తూ బాండ్ల (విరాళాల) పథకం ప్రవేశపెట్టినపుడు దాతల పేర్లు కాపాడుతామని చెప్పారు. మరి ఎలా బయటపెడతారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వీటన్నిటిని తోసిపుచ్చింది. 2019, ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలను ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసినా వెల్లడి చేయలేదు. ముందు డీఎంకే  తప్ప ఏ రాజకీయ పార్టీ తమ బాండ్ల వివరాలను వెల్లడించలేదు. బీజేపీ ప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం విరాళాల వివరాలను వెల్లడించడం కుదరదని ప్రకటించింది. ఇది పారదర్శకతను పాతర వేసే పద్ధతి కాదా?

ఈ పథకం రాజ్యాంగ విరుద్ధం 

21 సంస్థలు బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో వందల కోట్ల విరాళాలు ఇచ్చాయి.   దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన తర్వాతే వందల వేల కోట్ల రూపాయలు బీజేపీ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడం జరిగింది. బీజేపీ ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం ఒక చట్టబద్ధమైన భారీ అవినీతి పథకం.  ఇది ఒక భారీ ఎన్నికల స్కామ్.  బీజేపీ  60 శాతం పైగా విరాళాలతో  రూ.8,200 కోట్లు పెట్టుబడిదారుల నుంచి నయానా భయానా వసూలు చేసిందని అర్థమవుతున్నది. పారదర్శకత ఏమాత్రం లేని ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం. 

- నైనాల గోవర్ధన్, సోషల్​ ఎనలిస్ట్