న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్, హైడ్రోజన్తో నడిచే కమర్షియల్ వాహనాల (సీవీ) ను తీసుకొస్తామని, ఈ టెక్నాలజీలపై పెట్టుబడులను మరింత పెంచుతామని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటించారు. వీటితో పాటు క్లీనర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) టెక్నాలజీ కూడా అవసరమని నొక్కిచెప్పారు.
2025-–26 యాన్యువల్ రిపోర్ట్లో వాటాదారులను ఉద్దేశించి ఆయన లేఖ రాశారు. ‘‘ జీరో ఎమిషన్స్ కోసం ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల రేంజ్ను విస్తరిస్తూనే.. భారీ రవాణా వాహనాల కోసం హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతలలో పెట్టుబడులను టాటా మోటార్స్ కొనసాగిస్తుంది”అని తెలిపారు.
డిజిటల్ టెక్నాలజీస్, ఏఐ , కనెక్టెడ్ వెహికల్స్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ , డేటా-ఆధారిత ఫ్లీట్ సర్వీసెస్ వంటి సరికొత్త సాంకేతికతలు భవిష్యత్తు రవాణా రంగాన్ని శాసించనున్నాయని అభిప్రాయపడ్డారు. కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్కు ఏకంగా రూ. 83,855 కోట్ల వార్షిక ఆదాయం వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో (రూ. 76,359 కోట్లు) పోలిస్తే ఇది 9.8 శాతం ఎక్కువ.
