టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నది. తొలి విడతగా హైదరాబాద్ - విజయవాడ రూట్లో 50 బస్సులను 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడపాలని సంస్థ నిర్ణయించింది. ఇయ్యాల ‘ఈ గరుడ’ బస్సుల ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నది. తొలి విడతగా హైదరాబాద్ – విజయవాడ రూట్లో 50 బస్సులను 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడపాలని సంస్థ నిర్ణయించింది. ‘ఈ–గరుడ’ పేరుతో పిలిచే ఈ బస్సులను ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ మియాపూర్లో మంగళవారం ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. మొదట 10 బస్సులను ప్రారంభించి, తర్వాత దశలవారీగా వీటి సంఖ్యను పెంచనున్నారు. ఈ బస్సుకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. వచ్చే రెండేళ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్టు సంస్థ పేర్కొంది. వాటిలో 1,300 బస్సులను హైదరాబాద్లో, 550 బస్సులను దూర ప్రాంతాలకు నడుపనున్నారు. 10 డబుల్ డెక్కర్ బస్సులను హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్టు తెలిపారు.
ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రత్యేకతలు
- 12 మీటర్ల పొడవుండే ‘ఈ– గరుడ’ బస్సులో 41 సీట్లుంటాయి.
- ప్రతి సీటు వద్ద ఫోన్ చార్జింగ్, రీడిండ్ ల్యాంప్, ప్యానిక్ బటన్, వెహికల్ ట్రాకింగ్ సిస్టం ఉంటాయి.
- మూడు సీసీ కెమెరాలు ఉంటాయి. ఆటోమెటిక్ ప్యాసింజర్ కౌంటర్ (ఏపీసీ) కెమెరా, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా అమర్చారు.
- బస్సు ముందు, వెనకాల ఎల్ఈడీ బోర్డులు, అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించే ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం (ఎఫ్డీఎస్ఎస్) ఉంటాయి.