- ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సంస్థను కాపాడాలి
- రాష్ట్రంలో ఏ డిపోను ఎత్తివేయం
- టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్
పరిగి వెలుగు: గ్రామాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం ఆయన వికారాబాద్ జిల్లాలోని పరిగి డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ డిపోను ఎత్తివేయడం లేదని, అవి పుకార్లు మాత్రమేనని, వాటిని నమ్మొద్దని సూచించారు. పరిగి డిపో లాభాల్లో నడుస్తోందని కార్మికులు బాగా కృషి చేసి ఇంకా లాభసాటిగా నడపాలని అభినందించారు. పరిగి డిపో బస్సులకు కర్ణాటక డిజిల్ వినియోగిస్తున్నట్లు డిపో డీఎం పవిత్ర చెప్పగా, మన రాష్ట్రం నుంచే వాడాలని సజ్జనార్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,016 బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. పరిగి డిపోకు కూడా కొత్త బస్సులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. పరిగి డిపో కర్ణాటక రాష్ట్రం సరిహద్దులకు దగ్గరగా ఉండడంతో ఆర్టీసీ సంబంధాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామన్నారు. ఏ కార్మికుడిని వీఆర్ఎస్ తీసుకోవాలని బలవంతం చేయలేదని స్పష్టం చేశారు. సజ్జనార్ను ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి కలిసి మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎండీకి టీజేఎస్యూ జనరల్ సెక్రటరీ హనుమంతు వినతిపత్రం అందజేశారు.