
- శేషాచలం అడవుల నుంచి హైదరాబాద్కు
- ముఠాలోని పాత నేరస్తుడు అరెస్ట్
- రెండు ఏనుగుల దంతాలు స్వాధీనం
- వీటి విలువ రూ. 3 కోట్లకు పైమాటే
ఎల్బీ నగర్, వెలుగు: సిటీలో ఏనుగు దంతాల (ఐవరీ) స్మగ్లింగ్ కలకలం రేపింది. ఎక్కడో శేషాచలం అడవుల నుంచి వందలాది చెక్పోస్టులు, వేలాది పోలీసుల కళ్లుగప్పి, ఏనుగు దంతాలను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్కు తెచ్చి అమ్మాలని చూసిన ముఠాలోని ఒక సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం ఎల్బీనగర్లోని తన క్యాంప్ ఆఫీస్లో రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
ఏపీలోని రాయచోటికి చెందిన రేకులకుంట ప్రసాద్(32) గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై తిరుపతి జైలులో ఉండగా, అక్కడ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అతనికి పరిచయమయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిద్దరూ ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్లో భాగంగా లోకేశ్వర్ రెడ్డి శేషాచలం అడవుల్లోని స్మగ్లర్ల నుంచి రెండు దంతాలను కొనుగోలు చేశాడు. అనంతరం వీటిని అక్కడ్నుంచి చెక్పోస్టులు, పోలీసుల కళ్లుగప్పి నిందితులిద్దరూ కలిసి ప్రైవేట్ ట్రావెల్బస్సులో హైదరాబాద్ తరలించి, ఎక్కువ ధరకు అమ్మాలని ప్లాన్ చేశాడు.
విశ్వసనీయ సమాచారం రావడంతో ఎల్బీనగర్లో ఎస్ఓటీ పోలీసులు, హయత్నగర్ అటవీ శాఖ అధికారులు కలిసి నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా కన్పించిన నిందితుడు రేకుల కుంట ప్రసాద్ ను అరెస్టు చేసి అతని నుంచి 2 ఏనుగుల దంతాలను, ఒక్క సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతని వెనుకల వస్తున్న మరో నిందితుడు లోకేశ్వర్రెడ్డి పోలీసుల గమనించి అక్కడ్నుంచి పరారయ్యాడు. ఏనుగు దంతాల బరువు 5.62 కిలోలు ఉందని, వీటిని ఏనుగు నుంచి కట్చేసినట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు.
వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సీపీ సుధీర్బాబు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని, ఈ ఐవరీ స్మగ్లింగ్లో ఇంకెంత మంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అసలు వీరికి దంతాలు ఎవరిచ్చారని కూపీ లాగుతున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎల్బీనగర్-మహేశ్వరం ఎస్ఓటీ అదనపు డీసీపీ ఎండీ షకీర్ హుస్సేన్, రంగారెడ్డి జిల్లా హయత్నగర్ అటవీ రేంజ్ అధికారి సాయి ప్రకాశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.