న్యూఢిల్లీ: టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ సంపద రోజురోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన గ్లోబల్ రిచ్లిస్టులో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఫోర్బ్స్ రిచ్లిస్టులో 282 బిలియన్ డాలర్ల (రూ. 21.43 లక్షల కోట్ల) సంపదతో టాప్ పొజిషన్లో మస్క్ ఉండగా, 183 బిలియన్ డాలర్ల (రూ.13.9 లక్షల కోట్ల) తో సెకెండ్ ప్లేస్లో అమెజాన్ ఫౌండర్ జెఫె బెజోస్ ఉన్నారు. వీరిరువురి సంపద మధ్య 100 బిలియన్ డాలర్లు (రూ.7.6 లక్షల కోట్లు) గ్యాప్ ఉండడం గమనించాలి. అంటే మస్క్కి, బెజోస్కి మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద అంత గ్యాప్ ఉందన్న మాట. ఎలన్ మస్క్ సంపద 2020 ప్రారంభంలో కేవలం 26 బిలియన్ డాలర్లే. కరోనా వలన ఎక్కువగా లాభపడిన వారిలో మస్క్ ఉన్నారు. ఒక్క 2020లోనే ఆయన సంపద ఏకంగా 110 బిలియన్ డాలర్లు పెరిగింది. ఒకే ఏడాదిలో ఒకరి సంపద ఇంతలా పెరగడం ఫోర్బ్స్ హిస్టరీలో మొదటి సారి. 2021 లో మస్క్ సంపద మరో 90 బిలియన్ డాలర్లు ఎగిసింది. అప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగిన బెజోస్ను మస్క్ దాటేశారు. ఫోర్బ్స్ రిచ్లిస్టులోని మూడో ప్లేస్లో ఉన్న లూయిస్విటన్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంటే మస్క్ సంపద 115 బిలియన్ డాలర్లు ఎక్కువ. బిల్గేట్స్, వారెన్ బఫెట్ వంటి మహా ధనవంతులకు ఆయన అందనంత ఎత్తులో ఉన్నారు.
ట్విటర్ బోర్డులో సీటు వద్దు..
ట్విటర్ డైరక్టర్ల బోర్డులో జాయిన్ కాకూడదని ఎలన్ మస్క్ నిర్ణయించుకున్నారని ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. మస్క్తో డైరెక్ట్గా మాట్లాడామని, బోర్డుతో చర్చించామని ఆయన అన్నారు. ఈ నెల 9 న కంపెనీ బోర్డులో మస్క్ జాయిన్ కావాల్సి ఉంది. కానీ, జాయిన్ కావడం లేదని ఆ రోజు మార్నింగ్ మస్క్ చెప్పారని పరాగ్ అన్నారు. కాగా, ట్విటర్లో 9.2 % వాటాను మస్క్ కొన్నారు.