
హైదరాబాద్, వెలుగు: తాత్కాలిక సెక్రటేరియెట్ బీఆర్కే భవన్లో రిపేర్ల కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రెండు నెలల నుంచి కొనసాగుతున్న భవన్ మరమ్మతులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పూర్తి కావటానికి దసరా వరకు సమయం పట్టవచ్చని అధికారులు అంటున్నారు.
ఉద్యోగులందరికీ ఒకటే లిఫ్టు
బీఆర్కే భవన్లో మొత్తం 9 ఫ్లోర్లు ఉండగా.. అందులో కేవలం ఐదు లిప్ట్ లే ఉన్నాయి. వీటిలో రెండు లిఫ్టులు చెడిపోగా వాటిని రెండు నెలల నుంచీ రిపేర్ చేస్తూనే ఉన్నారు. మిగతా మూడు లిఫ్ట్లలో ఒక లిఫ్ట్ మాత్రమే ఉద్యోగులకు అందుబాటులో ఉంచారు. మరో లిఫ్ట్ సీఎస్, ఇతర ఉన్నతాధికారులకు, ఇంకో లిఫ్ట్ను రిపేర్లుచేస్తున్న వర్కర్స్ కోసం కేటాయించారు. రోజూ వందలాది మంది ఉద్యోగులు భవన్లో డ్యూటీ చేస్తుంటారు. వారికి ఒకే ఒక్క లిఫ్ట్ ఉండటం తీవ్ర సమస్యగా మారింది. మహిళ ఉద్యోగులు, దివ్యాంగ ఉద్యోగులు కూడా లిఫ్ట్ కోసం చాలా సేపు ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని ఫ్లోర్లలో వాష్ రూమ్ ల రిపేర్లు కూడా ఇప్పటికీ పూర్తికాలేదు.
కారిడార్లలోనే బండిల్స్..
బీఆర్కే భవన్ ఫ్లోర్లలో రిపేర్లు జరుగుతుండటంతో పాత సెక్రటేరియెట్ నుంచి షిఫ్ట్ చేసిన ఫర్నిచర్, ఫైళ్ల బండిళ్లను భవన్లోని అన్ని కారిడార్లలో ఉంచారు. దీంతో అక్కడ నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు భవన్లో సెక్రటేరియెట్ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి మీడియాను అటువైపు అనుమతించటం లేదు. రిపేర్లు జరగుతున్నందున ఇప్పుడు అనుమతిస్తే పనులకు ఆటంకం కలుగుతాయని అధికారులు భావిస్తున్నట్లు
తెలుస్తోంది.