అబూజ్‌మడ్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టు లు మృతి

అబూజ్‌మడ్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్..  ఏడుగురు మావోయిస్టు లు మృతి
  •     ఒక కానిస్టేబుల్ కూడా..  
  •     మృతుల్లో మావోయిస్టు కీలక నేత, కామారెడ్డి వాసి చందర్‌‌రావు  

భద్రాచలం/కామారెడ్డి, వెలుగు: మహారాష్ట్ర. చత్తీస్‌గఢ్ సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్ర పోలీసుల ఎలైట్ సీ-60 కమాండో యూనిట్‌కు చెందిన కానిస్టేబుల్ దీపక్ చిన్నా మడవి (38) కూడా గాయాలతో మరణించాడు. మరో కానిస్టేబుల్ జోగా మడవికి తీవ్రగాయాయ్యాయి. 

మావోయిస్టుల సమావేశం జరుగుతుందన్న పక్కా సమాచారంతో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన సీ-60 బలగాలు బామ్రాగఢ్ తహశీల్​ఫడేవా అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్​చేపట్టాయి. శుక్రవారం ఉదయం మావోయిస్టులున్న ప్రాంతానికి బలగాలు చేరుకున్నాయి. మావోయిస్టుల సమావేశ స్థలాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. నక్సల్స్ జరిపిన కాల్పుల్లో సీ-60 కమాండోస్​కు చెందిన కానిస్టేబుల్​దీపక్, జోగా మడవి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హెలీకాప్టర్​ద్వారా బామ్రాగఢ్​ఆస్పత్రికి తరలించారు. 

చికిత్స పొందుతూ దీపక్​చనిపోయాడు. జోగా చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఏకే-47, ఎస్ఎల్ఆర్​రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత లోకోటి చందర్​రావు అలియాస్​ స్వామి అలియాస్​ప్రభాకర్‌‌తో పాటు ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. కూంబింగ్​ఇంకా కొనసాగుతున్నదని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. కాల్పుల్లో చనిపోయిన దీపక్ డెడ్‌బాడీని స్వగ్రామం ఆహేరాకు తరలించారు.  

30 ఏండ్లుగా అజ్ఞాతంలోనే.. 

లోకోటి చందర్​రావు(65) అలియాస్ ​స్వామి అలియాస్ ​ప్రభాకర్‌‌ది కామారెడ్డి జిల్లా. ఆయన 30 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఇతని భార్య  సులోచన ఉద్యమంలో పని చేస్తూ  12 ఏండ్ల కింద అనారోగ్యంతో చనిపోయారు. వీళ్ల కూతురు, కొడుకు కూడా చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు దళాల్లో పనిచేశారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడికి చెందిన చందర్​రావు 1988  ప్రాంతంలో గ్రామస్థాయి మిలిటెంట్‌గా పని చేశారు. ఆ తర్వాత దళంలో చేరారు. తన భార్య సులోచన, ఇద్దరు పిల్లలను కూడా చందర్‌‌ రావు ఉద్యమంలోకి తీసుకెళ్లారు.