కాళేశ్వరం గుట్టు విప్పుతా.. రెండ్రోజుల్లో డాక్యుమెంట్లన్నీ బయటపెడ్త: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం గుట్టు విప్పుతా.. రెండ్రోజుల్లో డాక్యుమెంట్లన్నీ బయటపెడ్త: సీఎం రేవంత్ రెడ్డి
  • రాష్ట్ర ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నడు
  • కేసీఆర్ చెప్పినట్టే ఆయన చేస్తున్నడు.. వాళ్లిద్దరూ ఒక్కటే
  • తెలంగాణకు దుష్మన్.. కేసీఆర్ కుటుంబమే
  • ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత.. ఇప్పుడు ఆమె కూడా దయ్యం అయ్యారా? 
  • నేను ఉన్నంత వరకు ఆ ఫ్యామిలీకి కాంగ్రెస్‌‌లో నో ఎంట్రీ 
  • కర్నాటకలో కులగణన అమలుపై చర్చించేందుకే ఢిల్లీకి వచ్చినట్టు వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తానని సీఎం రేవంత్‌‌ రెడ్డి తెలిపారు. ఆ ప్రాజెక్టు గుట్టు విప్పుతానని, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను బయటపెడతానని చెప్పారు. ‘‘ఈ 18 నెలల కాలంలో బీఆర్ఎస్‌‌పై మేమెప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కమిషన్లు వేశాం. ఆ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటున్నాయి. కాళేశ్వరం అవకతవకలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్‌‌తో కమిషన్ వేశాం. కేసీఆర్‌‌‌‌తో పాటు అందరూ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కథంతా ప్రజలకు వివరిస్తాను” అని తెలిపారు.

‘‘తెలంగాణలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజలే నాకు కమిషన్. వాళ్లకు వాస్తవాలు చెబుతాను. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జ్యుడీషియల్ కమిషన్, విజిలెన్స్ కమిషన్, ఇతర రిపోర్టులను బయటపెడతాను. రెండ్రోజుల్లో ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌ పెట్టి అవన్నీ ప్రజలకు చెబుతాను” అని సీఎం వెల్లడించారు.   బుధవారం ఢిల్లీ తుగ్లక్ రోడ్‌‌‌‌లోని తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి చిట్‌‌‌‌చాట్ చేశారు. కాళేశ్వరం, మంత్రివర్గ విస్తరణ, మంత్రులకు శాఖల కేటాయింపు తదితర అంశాలపై మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా ఆరోపించారు. ఇదే నిజమైతే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని ఎలా చెప్తారు. ఈటల రాజేందర్ కామెంట్స్‌‌‌‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా సమర్థించారు” అని మండిపడ్డారు.
 
కేసీఆర్, కిషన్ రెడ్డి ఒక్కటే.. 
తెలంగాణ అభివృద్ధిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ప్రాజెక్టును అడ్డుకుం టున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఏం చెప్తే.. కిషన్ రెడ్డి అదే అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కిషన్ రెడ్డి, కేసీఆర్ ఒక్కటేనని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కిషన్‌‌‌‌ రెడ్డితో సహా ఇతర కేంద్ర మంత్రులను చాలాసార్లు కలిశామని.. కానీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి ఏనాడైనా రాష్ట్ర అభివృద్ధి అంశాలపై రివ్యూ చేపట్టారా? అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్‌‌‌‌ ముందు కిషన్ రెడ్డి ప్రస్తావించడం లేదు. అందుకే రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ రావడం లేదు. కనీసం ప్రధాని మోదీ దగ్గరైనా తెలంగాణ అంశాలను కిషన్ రెడ్డి లేవనెత్తారా? నిర్మలా సీతారామన్ చెన్నైకి, ప్రహ్లా ద్ జోషి బెంగళూరుకు మెట్రో రైలు తీసుకెళ్లారు. మరి తెలంగాణలో మెట్రో ఫేజ్‌‌‌‌2కు కిషన్ రెడ్డి అనుమతులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు?” అని ప్రశ్నించారు.

కేసీఆర్ వ్యతిరేకిస్తున్నందుకే, మెట్రో రైల్ ప్రాజెక్టును కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో వరదలు వస్తే రూపాయి తేలేదు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్.. ఇలా ఏ ప్రాజెక్టు తేలేదు. కానీ దేవుడిచ్చే వాటికి తానే యజమాని అన్నట్టు... ప్రాసెస్‌‌‌‌లో భాగంగా వచ్చే వాటిని తానే తెచ్చినట్టు ఆయన చెప్పుకుంటున్నారు. నేను ప్రధానిని కలిస్తే తప్పుపడ్తున్న కిషన్ రెడ్డి.. తెలంగాణకు సంబంధించిన అంశాలపై తమ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలతో ఎందుకు ప్రధానిని కలవడం లేదు?” అని ప్రశ్నించారు. రాష్ట్ర అంశాలపై కిషన్ రెడ్డి రివ్యూ చేస్తానంటే..తెలంగాణ అధికారులందరినీ తీసుకొని ఢిల్లీకి వస్తానని చెప్పారు. ‘‘కేంద్ర ప్రాజెక్టులు కొన్ని రాష్ట్రంలో పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని గతంలో ప్రధాని మోదీ లిస్టు పంపారు. వాటిపై వెంటనే రివ్యూ చేసి పరిష్కరించాను. ఇందులో బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో చాలా వేగంగా స్పందించారని స్వయంగా కేంద్రమంత్రి గడ్కరీ ఫోన్ చేసి మెచ్చుకున్నారు” అని పేర్కొన్నారు. 

కిషన్ రెడ్డి చెప్పేది తప్పు..
కులగణన కోసం తన ఇంటికి ఎవరూ రాలేదని కిషన్ రెడ్డి చెప్పిందంతా తప్పు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కులగణనలో భాగంగా ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించాం. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనూ ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ చేసుకునే అవకాశం కల్పించాం. మొత్తంగా 97 శాతం మంది వివరాలు సేకరించాం. కేసీఆర్, కిషన్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్, గ్రేటర్ పరిధిలోని ఇతర ముఖ్య నేతల వివరాలను నేరుగా వెళ్లి నమోదు చేసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించాం. కానీ వీళ్లంతా రాజకీయంగా కులగణన సర్వేకు దూరంగా ఉన్నారు. నిజంగా కిషన్ రెడ్డి కులగణన సర్వేలో ఎన్‌‌‌‌రోల్ చేసుకోవాలనుకుంటే.. కనీసం టోల్ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌కు కాల్ చేసినా సరిపోయేది కదా!” అని ప్రశ్నించారు. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ది ‘అసెంబ్లీ రౌడీ’ ఫ్యామిలీ..
ప్రజల దృష్టిని తమవైపు మళ్లించుకునేందుకే కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల్లో అటెన్షన్ పొందేందుకు సెల్ఫ్‌‌‌‌ క్రియేషన్ చేస్తున్నదని విమర్శించారు. ‘‘అసెంబ్లీ రౌడీ సినిమాలో బాషా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లా..  కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు వ్యవహరిస్తున్నారు. వాళ్లలో వాళ్లు కొట్టుకుంటున్నట్టు డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు తమలో తాము గొడవ పెట్టుకుని.. రాష్ట్రంలో చర్చకు తెరలేపారు. తీరా చూస్తే కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు నోటీసులు ఇచ్చినందుకు అందరు కలిసి కాళేశ్వరం కమిషన్​ దగ్గర ఆందోళన చేస్తున్నారు. అంటే ఇంతకాలం కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత... ఇప్పుడు ఆమె కూడా దయ్యం అయ్యారా?” అని ప్రశ్నించారు. తాను ఉన్నంత వరకు కాంగ్రెస్‌‌‌‌లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు దుష్మన్.. కేసీఆర్, ఆయన కుటుంబమేనని మండిపడ్డారు. ఈ దుష్మన్ పరివార్‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్ పార్టీలో జాగా లేదన్నారు. 

అందుకే ఢిల్లీకి వచ్చా.. 
తమది రేర్ (ఆర్ఏఆర్ఈ) కాంబినేషన్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రేర్ అంటే రాహుల్, రేవంత్ అని అభివర్ణించారు. పార్టీ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో పార్టీ అంతర్గత అంశాలపైనే చర్చించామని తెలిపారు. మంత్రుల శాఖలపై చర్చ జరగలేదని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జ్, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం లేకుండా కేబినెట్‌‌‌‌పై ఎలా చర్చిస్తామని ప్రశ్నించారు. ఇదంతా ప్రతిపక్షాలు ఆడుతున్న మైండ్‌‌‌‌గేమ్ అని మండిపడ్డారు. వాళ్ల మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. కర్నాటకలో అమలు చేయాల్సిన కులగణనపై హైకమాండ్‌‌‌‌తో చర్చించేందుకే ఢిల్లీకి వచ్చానని తెలిపారు. ‘‘తెలంగాణలో చేపట్టిన కులగణన మోడల్‌‌‌‌ను కర్నాటకలో అమలు చేయాలని హైకమాండ్ ఆలోచిస్తున్నది. అందులో భాగంగా ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యను, నన్ను పిలిచి.. కులగణనపై వివరించాలని హైకమాండ్ మీటింగ్ నిర్వహించింది. రాష్ట్రంలో చేపట్టిన కులగణన గురించి కర్నాటక అధికారులకు వివరించాను. వాళ్ల సందేహాలను నివృత్తి చేశాను” అని చెప్పారు.  

నక్సల్‌ ‌బరి ఉద్యమం అంతం కాదు..
నక్సల్‌‌ బరి ఉద్యమానికి అంతం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘నక్సల్‌ ‌‌‌బరి ఉద్యమం అంతమయ్యే ప్రసక్తే లేదు. నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ. అది లా అండ్ ఆర్డర్ సమస్య కాదు. ఇది పూర్తిగా సోషల్ ఇష్యూ. ఎప్పటి వరకు ప్రజల్లో సోషల్ ఇంట్రెస్ట్ ఉంటుందో.. అప్పటి వరకు నక్సల్‌‌‌‌బరి వివిధ రూపాల్లో నిక్షిప్తమై ఉంటుంది. 1970లలో బెంగాల్‌‌‌‌లో నక్సలిజం పుట్టింది. ఆ క్రమంలో కాంగ్రెస్ చేపట్టిన భూసంస్కరణలతో నక్సలిజం కొంతవరకు తగ్గింది. నిజాం, భూస్వాముల నుంచి తీసుకుని 25 లక్షల ఎకరాలు ఎస్సీలకు, 10 లక్షల ఎకరాలు ఆదివాసీలకు కాంగ్రెస్ సర్కార్ పంచింది” అని పేర్కొన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నిసార్లయినా వెళ్తా..
రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్తానని సీఎం రేవంత్ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎక్కడుంటే అక్కడికి రాష్ట్ర నాయకత్వం వెళ్లాల్సి ఉం టుందని చెప్పారు. ‘‘ఢిల్లీ నేషనల్ క్యాపిటల్. పొలిటికల్ క్యాపిటల్ కాదు. కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చేందుకు, పార్టీ హైకమాండ్‌‌‌‌ను కలిసేందుకు నేను కచ్చితంగా ఢిల్లీకి వస్తాను. మెట్రో ఫేజ్ 2, ట్రిపుల్ ఆర్, రైల్వే లైన్లు, రాష్ట్ర అభివృద్ధి కోసం వందల సార్లయినా ఢిల్లీకి రాకతప్పదు” అని అన్నారు. తాను తరచూ ఢిల్లీకి వెళ్తున్నానని విమర్శిస్తున్న బీఆర్ఎ స్ నేతలు.. ఎర్రవల్లి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌కు గాడిదలు కాసేందు కు వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. అప్పుడప్పుడు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. తాను ఏబీవీపీ నుంచి డ్రాపవుట్ స్టూడెంట్ కాదని, ఎలివేట్ స్టూడెంట్ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర మంత్రివర్గంలో 18 మంది ఉండేందుకు అవకాశం ఉంది. కేసీఆర్ హయాంలో 8 మంది  రెడ్లు, నలుగురు వెలమ, ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినోళ్లకు పదవులు కట్టబెట్టారు. జనాభాలో దాదాపు 40 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మాత్రం ఒక్కో పదవి ఇచ్చారు. మేం మాత్రం సామాజిక న్యాయంలో భాగంగా స్పీకర్, నాలుగు మంత్రి పదవులు ఎస్సీలకు ఇచ్చాం. అంటే 18 శాతం ఉన్న ఈ వర్గానికి మంత్రివర్గంలో 26 శాతం ప్రయార్టీ ఇచ్చాం.

‘క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నోళ్లకు పదవులు దక్కుతాయి. నా ఇంట్లో ఎవరూ యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. అందుకే ఎవరికీ అవకాశం దక్కలేదు. క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలా? వద్దా? అన్నది ఆ వ్యక్తులు, వారి కుటుంబాలకు సంబంధించిన అంశం.

కులగణన ఆధారంగానే మంత్రివర్గ విస్తరణ.. 
కులగణన సర్వే డేటా ఆధారంగానే మంత్రివర్గ విస్తరణ చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చరిత్రలో తొలిసారి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం దక్కేలా కేబినెట్‌‌‌‌ విస్తరణ చేశామన్నారు. మిగిలిన 3 బెర్త్‌‌‌‌లను కూడా సమయానుగుణంగా భర్తీ చేస్తామని చెప్పారు. ‘‘రాష్ట్ర మంత్రి వర్గంలో 18 మంది ఉండేందుకు అవకా శం ఉంది. కేసీఆర్ హయాంలో 8 మంది  రెడ్లు, నలుగురు వెలమ, ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినోళ్లకు పదవులు కట్టబెట్టారు.

జనాభాలో దాదాపు 40 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మాత్రం ఒక్కో పదవి ఇచ్చారు. మేం మాత్రం సామాజిక న్యాయంలో భాగంగా స్పీకర్, 4 మంత్రి పదవులు ఎస్సీలకు ఇచ్చాం. అంటే 18 శాతం ఉన్న ఈ వర్గానికి మంత్రివర్గంలో 26 శాతం ప్రయార్టీ ఇచ్చాం” అని పేర్కొన్నారు. ‘‘క్రియాశీలక రాజకీయా ల్లో ఉన్నోళ్లకు పదవులు దక్కుతాయి. నా ఇంట్లో ఎవరూ యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. అందుకే ఎవరికీ అవకాశం దక్కలేదు. క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలా? వద్దా? అన్నది ఆ వ్యక్తులు, వారి కుటుంబాలకు సంబంధించిన అంశం” అని పేర్కొన్నారు.