
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు తీపికబురు చెప్పింది. అత్యవసర వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం/కొనుగోలు, ఉన్నత చదువు వంటి అవసరాల కోసం ఆటోమేటెడ్ సెటిల్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్స్ (ఏఎస్ఏసీ) పరిమితిని రూ. లక్ష నుంచి రూ. ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది.
అత్యవసర సమయాల్లో నిధుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, త్వరగా పీఎఫ్ అడ్వాన్స్లను పొందవచ్చు. ఆటో-క్లెయిమ్ విధానం మనుషుల ప్రమేయం లేకుండా, ఐటీ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. కేవైసీ, బ్యాంక్ వ్యాలిడేషన్ పూర్తయితే, మూడు రోజుల్లోనే డబ్బులు ఖాతాలో జమవుతాయి. గతంలో పది రోజుల వరకు సమయం పట్టేది. ఈపీఎఫ్ఓ 2020 ఏప్రిల్లో అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఆటో-క్లెయిమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.