టెన్త్ చదివిన ప్రతి స్టూడెంట్ ఇంటర్ చదవాల్సిందే: సీఎం రేవంత్

టెన్త్ చదివిన ప్రతి స్టూడెంట్ ఇంటర్ చదవాల్సిందే: సీఎం రేవంత్

హైదరాబాద్: ప‌దవ త‌ర‌గతి పాస్ అయిన ప్రతి విద్యార్థి త‌ప్పనిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. 10వ త‌ర‌గ‌తిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత క‌నిపిస్తున్నప్పటికీ ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తయ్యే స‌రికి ఆ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డానికి గ‌ల కారణాలను అధ్యయనం చేసి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని సూచించారు. బుధవారం (జూలై 2) ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో విద్యా శాఖ‌పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. 

ప్రతి విద్యార్థి జీవితంలో ఇంట‌ర్మీడియ‌ట్ ద‌శ కీల‌క‌మైనందున‌, ఆ ద‌శ‌లో విద్యార్థికి స‌రైన మార్గద‌ర్శక‌త్వం అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇత‌ర రాష్ట్రాల్లో 9 వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు అమలు చేస్తున్నారని, అందువల్ల అక్కడ డ్రాపౌట్స్ సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని అధికారులు వివరించారు. అలాంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ విష‌యంలో విద్యా క‌మిష‌న్, ఆ విభాగంలో ప‌ని చేసే ఎన్జీవోలు, పౌర స‌మాజం సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. 

ఇంట‌ర్మీడియ‌ట్ విద్యను పటిష్టపరచడానికి శాస‌న‌స‌భ‌లోనూ చ‌ర్చకు పెడ‌తామ‌ని, ఇంటర్‌లో విద్యార్థుల చేరిక‌తో పాటు వారి హాజ‌రుపైనా దృష్టిపెట్టాల‌న్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ న‌మూనాల‌ను ఈ సందర్భంగా సీఎం ప‌రిశీలించారు. ప్రతి పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాల‌ని సూచించారు. పాఠ‌శాల‌ల నిర్మాణం ప్రక్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, నిర్మాణాల ప్రగ‌తిపై ప్రతి వారం త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

►ALSO READ | బనకచర్లను అడ్డుకుంటాం.. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోం: MP వంశీ

ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో బాలుర‌కు ఒక‌టి, బాలిక‌ల‌కు ఒక‌టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణాల‌ను చేప‌డ‌తామ‌న్నారు. ఇప్పటికే ఒక్కో పాఠ‌శాల‌కు సంబంధించి స్థల సేక‌ర‌ణ పూర్తయినందున‌, రెండవ పాఠ‌శాల‌కు సంబంధించిన స్థల గుర్తింపు, సేక‌ర‌ణ ప్రక్రియ‌పై దృష్టి సారించాల‌ని ఆదేశించారు. వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వవిద్యాల‌యం నిర్మాణ న‌మూనాను పరిశీలించిన సీఎం రేవంత్.. ప‌లు మార్పుల‌ను సూచించారు. సాధ్యమైనంత త్వర‌గా టెండ‌ర్ల ప్రక్రియ‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు.