పోడు పట్టాలివ్వాలంటే.. మరుగుదొడ్లు కట్టుకోవాల్సిందే

పోడు పట్టాలివ్వాలంటే.. మరుగుదొడ్లు కట్టుకోవాల్సిందే

కొత్తగూడ, వెలుగు: మంజూరైన పోడు పట్టాలు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీ స్వాతి షాక్​ఇచ్చింది. పాస్​బుక్కులు ఇవ్వాలంటే ప్రతిఒక్కరూ ఇండ్లలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మెలికపెట్టింది. గ్రామంలోని 170 మంది పోడు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పట్టాలు మంజూరు చేసింది. 

రెండు రోజుల కింద పంచాయతీ సెక్రటరీ 140 మంది రైతులకు పంపిణీ చేసింది. 30 మంది రైతుల ఇండ్లలో మరుగుదొడ్లు లేకపోవడంతో, ఎన్నిసార్లు చెప్పినా నిర్మించుకుంటలేరని వారికి పట్టా పాస్​బుక్కులు ఇవ్వకుండా ఆపింది. దీంతో మంజూరైన పాస్ బుక్కులు ఎందుకు ఇవ్వడం లేదని సోమవారం లబ్ధిదారులు జీపీ ఆఫీస్ లో సెక్రటరీతో వాగ్వాదానికి దిగారు. పాస్​బుక్కులు ఆపిన విషయాన్ని తహసీల్దార్, ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. చివరికి వారి ఆదేశాలతో పంచాయతీ సెక్రటరీ రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.