
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో కొన్ని మండలాలకే రైతు భరోసా అందిందని, అన్ని మండలాలకు అందేలా చూడాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇదే విషయమై ఇబ్రహీంపట్రం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తుమ్మలకు లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కూడా తుమ్మలను కలిశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, నిట్టు జగదీశ్వర్, రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కిసాన్మోర్చా ధర్నా..
రైతు భరోసా అన్ని మండలాలకు ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో సాగర్ రహదారిపై ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో రవీందర్రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.