
బీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్, కేటీఆర్ బడేమియా చోటే మియాగా మారారని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. పార్టీలో కేసీఆర్, కేటీఆర్ లదే హవా అని.. మిగతా వారంతా జోకర్లేనని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు అవినీతి అనకొండలుగా తయారయ్యారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా, రైస్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఎమ్మెల్యేలంతా అక్రమ సంపాదనకు పోటీపడుతున్నారని ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేని వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తామనడం హస్యాస్పదమన్నారు. త్వరలో నిజామాబాద్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్నారు బూర నర్సయ్య.
టీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన బూర నర్సయ్య 2022 అక్టోబర్ లో బీజేపీలో చేరారు. తర్వాత చాలా సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, పార్టీలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించారు. ఇటీవల లిక్కర్ స్కాంలో కవిత ఎదుర్కొంటున్న ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు మించి తెలంగాణలో స్కాం జరుగుతోందని..తన వద్ద అన్నీ ఆధారాలున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఫారెన్ లిక్కర్ స్కామ్ జరుగుతోందంటూ ఆరోపణలు చేశారు.