వివేక్ వెంకటస్వామి చేరికతో.. కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం : రేవంత్ రెడ్డి

వివేక్ వెంకటస్వామి చేరికతో.. కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం : రేవంత్ రెడ్డి

వివేక్ వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ లో చేరికతో.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబంతో.. వెంకటస్వామి కుటుంబానికి మూడు తరాల అనుబంధం ఉందని.. సొంత కుటుంబంలోకి వివేక్ వచ్చారన్నారు రేవంత్ రెడ్డి. 2023, నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 

 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ వరకు.. మూడు తరాలుగా వివేక్ వెంకటస్వామి కుటుంబంతో అనుబంధాన్ని గుర్తు చేశారాయన. పార్టీలో అందరితో చర్చించి.. పార్టీ ఆహ్వానం మేరకు చేరినట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి. వివేక్ వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరికతో.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో కొట్లాడిన ఎంపీల్లో వివేక్ ఉన్నారన్నారు. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. వివేక్ వెంకటస్వామి కుటుంబం.. తెలంగాణకు ఎంతో అవసరం ఉందన్నారు.

వివేక్ వెంకటస్వామితోపాటు ఆయన కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారని.. వివేక్ కుమారుడు వంశీ కూడా పార్టీలో చేరినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి.