నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ, రేలకుంట గ్రామాల్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ దత్త రాజు గౌడ్, అసిస్టెంట్ కమిషనర్ నవీన్కుమార్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ దాడుల్లో 1,900 లీటర్ల బెల్లం పానకం, 55 లీటర్ల నాటుసారా, 60 కిలోల బెల్లం పానంను ధ్వంసం చేసి, 10 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా విక్రయానికి తరలిస్తున్న తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో ట్రైనీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు లక్ష్మణ్ ఆనంద్, నీలోఫర్, సుచిత, టాస్క్ఫోర్స్ సీఐ రమేశ్చందర్, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు నాగయ్య, నాగేశ్వరరావు, ఎస్సైలు పాల్గొన్నారు.
