
హైదరాబాద్ కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు గ్రేటర్ పరిధిలోని కల్లుకంపౌండ్లపై ఆకస్మిక దాడులు చేశారు. గ్రేటర్ పరిధిలో 100కు పైగా కల్లు కాంపౌండ్ లలో దాడులు నిర్వహించారు. కల్లు కంపౌండ్ల నిర్వహణ, కల్లు అమ్మకాలను పరిశీలించారు. పలు కల్లు కాంపౌండ్ లలో శాంపిల్స్ సేకరించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
కల్తీ కల్లు ఘటనలో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం మొత్తం 19 మంది కల్తీ కల్లు బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ తెలిపారు.
కూకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ మొదలుపెట్టింది. ఈ ఘటనకు ప్రధానంగా ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ శాఖ ప్రాథమిక దర్యాప్తు అనంతరం బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్వో వేణుకుమార్పై ప్రభుత్వం సస్సెన్షన్ వేటు వేసింది. బాలానగర్ డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్లు మాధవయ్య, జీవన్కిరణ్, ఈఎస్ ఫయాజ్పై విచారణ కొనసాగుతున్నది.
అలాగే, కల్లులో ‘ఆల్ఫ్రాజోలం’ అనే రసాయనాన్ని కలిపి విక్రయించినట్టు నిర్ధారణ అయిన 3 దుకాణాల లైసెన్స్ను జులై 10న అధికారులు రద్దు చేశారు. కూకట్పల్లి పరిధిలోని హైదర్నగర్, సర్దార్పటేల్నగర్, హెచ్ఎంటీహిల్స్ సాయిచరణ్కాలనీలోని ఈ 3 కల్లు దుకాణాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.