హార్ముజ్ జలసంధి మూసేస్తే.. ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి.. ?

హార్ముజ్ జలసంధి మూసేస్తే.. ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి.. ?

హార్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్​ను ఒమన్ గల్ఫ్​తో కలుపుతూ తద్వారా హిందూ మహాసముద్రంతో అనుసంధానించే ఒక ఇరుకైన సముద్ర మార్గం. ఈ జలసంధి ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన జలమార్గాల్లో ఒకటిగా పరిగణిస్తారు. దీని భౌగోళిక స్థానం, ముఖ్యంగా మధ్యప్రాచ్య చమురు నిల్వల విస్తరణ, దీనిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక జీవనాడిగా మార్చింది. 

అనుసంధానం: హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ లోని చమురు ఉత్పత్తి చేసే దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లకు సముద్ర మార్గం. 

తీర ప్రాంతాలు: దీని ఉత్తర తీరంలో ఇరాన్ దేశం, దక్షిణ తీరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ కు చెందిన ముసందమ్ ఎక్స్​ క్లేవ్ ఉన్నాయి. 

వెడల్పు: ఈ జలసంధి దాదాపు 167 కిలోమీటర్లు(104 మైళ్లు ) పొడవు ఉంటుంది. అత్యంత ఇరుకైన ప్రదేశంలో దీని వెడల్పు సుమారు 33 కిలోమీటర్లు (21 మైళ్లు) మాత్రమే. 

ట్రాపిక్ విభజన పథకం: ప్రమాదాలను నివారించడానికి, జలసంధి ద్వారా ప్రయాణించే ఓడలు ట్రాఫిక్ విభజన పథకాన్ని (టీఎస్ఎస్) అనుసరిస్తాయి. లోపలికి వచ్చే ఓడలు ఒక మార్గాన్ని, బయటికి వెళ్లే ఓడలు మరో మార్గాన్ని ఉపయోగిస్తాయి. ఈ మార్గాలు ఒక్కొక్కటి రెండు మైళ్ల వెడల్పుతో ఉంటాయి. 

వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యత: హార్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20 నుంచి 25 శాతం, లిక్విడ్ నేచురల్ గ్యాస్(ఎన్ఎన్ జీ)లో మూడో వంతు ఈ జలసంధి గుండానే రవాణా అవుతుంది. 

ముడిచమురు ఎగుమతులు: సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, ఇరాన్, ఖతార్ వంటి దేశాల నుంచి ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వాయువు ప్రధానంగా ఈ జలసంధి ద్వారానే ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటాయి. 

ఆసియా మార్కెట్ల ప్రాధాన్యత: ఈ జలసంధి ద్వారా రవాణా అయ్యే చమురు, ఎన్ఎల్​జీలో దాదాపు 85 శాతానికిగా పైగా ఆసియా మార్కెట్లకు(ముఖ్యంగా చైనా, భారత్, జపాన్, దక్షిణకొరియా) వెళ్తుంది. 
 

భారత్ పై ప్రభావం

ఇంధన భద్రత: భారతదేశం తన ముడిచమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. ఇందులో 40 శాతం పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుంది. అది హార్ముజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతుంది.

వ్యూహాత్మక నిల్వలు: హార్ముజ్ జలసంధిలో ఏదైనా అవాంతరం తలెత్తితే, భారతదేశ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. దీనిని ఎదుర్కోవడానికి భారతదేశం వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఏర్పాటు చేసింది. 

ధరల అస్థిరత: జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగితే  చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు అమాంతం పెరుగుతాయి. ఇది భారతదేశ ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రస్తుత పరిణామాలు, వివాదాలు

ఇరాన్ బెదిరింపులు: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా ఇజ్రాయెల్– గాజా సంఘర్షణ, అమెరికా–ఇరాన్ సంబంధాల క్షీణత కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని పదే పదే హెచ్చరించింది. 

ఇరాన్ పార్లమెంట్ ఆమోదం: 2025, జూన్ నాటికి ఇరాన్​పై అమెరికా దాడులకు నిరసనగా హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.  అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత జాతీయ భద్రతా సంస్థ ఆమోదం అవసరం. 

ప్రపంచంపై ప్రభావం: హార్ముజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచ చమురు మార్కెట్​పై తీవ్ర ప్రభావం పడుతుంది. చమురు ధరలు విపరీతంగా పెరగడం, రవాణా ఖర్చులు పెరగడం, అంతర్జాతీయ సరఫరా గొలుసులకు అంతరాయం కలగడం వంటివి జరుగుతాయి.