- మోదీ గ్యారంటీలను చూసి ఓటెయ్యాలి: కేంద్రమంత్రి జైశంకర్
యాదాద్రి/ హైదరాబాద్, వెలుగు : బీజేపీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ గ్యారంటీలను చూసి ఓటెయ్యాలని ఆయన ప్రజలను కోరారు. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ సందర్భంగా మంగళవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో జైశంకర్ మాట్లాడారు.
వెనుకబడిన దేశాన్ని పదేండ్లలో అభివృద్ధి దిశగా నడిపించిన బలమైన నాయకుడు మోదీ అని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ఎంతో కృషి చేశారని, పదేండ్లలో రూ.9.50 లక్షల కోట్లు ఇచ్చారని తెలిపారు. ఈ నిధులతో నేషనల్ హైవేలు, ఎయిమ్స్, ఔటర్ రింగ్రోడ్డు వంటి అభివృద్ధి పనులు చేశామన్నారు. పోచంపల్లి వస్త్రాలను జీ 20 సమావేశాల్లో పాల్గొన్న ప్రతినిధులకు కానుకగా అందించి.. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ఆయన చెప్పారు.
ప్రధాని మోదీని విమర్శించే స్థాయి రేవంత్రెడ్డికి లేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ మత రాజకీయాలకు పాల్పడుతోందని, హైదరాబాద్లో ఎంఐఎంతో అంటకాగుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ క్యాండిడేట్ డమ్మీ: బూర నర్సయ్య గౌడ్
కాంగ్రెస్ నుంచి డమ్మీ క్యాండిడేట్ను నిలబెట్టి పరోక్షంగా తన గెలుపు కోసం సహకరిస్తున్న రేవంత్రెడ్డికి థాంక్స్ చెప్పాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఎంపీ టికెట్ఇవ్వకుండా కోaమటిరెడ్డి బ్రదర్స్ను రేవంత్ మోసం చేశారన్నారు.
భారత్ ను ‘విశ్వబంధు’గా తీర్చిదిద్దాం : జైశంకర్
భారత్ ను విదేశీ వ్యవహారాల్లో విశ్వబంధుగా తీర్చిదిద్దామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ‘‘ఒకప్పుడు సరిహద్దు సమస్యలు అంటే అందరూ భారత్ వైపు చూసేవారు. కానీ, మోదీ పాలనలో భారత్ అత్యంత సురక్షిత దేశంగా మారిందని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు” అని ఆయన చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ‘ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకర్స్’ ఆధ్వర్యంలో విదేశాంగ విధానంపై నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ చీఫ్ గెస్టుగా మాట్లాడారు.