
- క్యాస్ట్, ఇన్ కమ్ నుంచి బర్త్, డెత్ అన్ని సర్టిఫికెట్లపైనా ఇంతే..
- విద్యాసంస్థలు రీ ఓపెన్తో సర్టిఫికెట్ల కోసం స్టూడెంట్స్ క్యూ
- కులం, ఆదాయానికి రూ.700
- ప్రశ్నిస్తే ఆఫిడవిఫ్ కోసమంటూ సమాధానం
లంగర్ హౌజ్కు చెందిన రాఘవేందర్ కుల, ఆదాయ సర్టిఫికెట్స్ కోసం అక్కడే ఓ మీ సేవ కేంద్రానికి వెళ్లగా నిర్వాహకుడు రూ.700 అవుతుందని చెప్పాడు. అన్ని డబ్బులు ఎందుకని ప్రశ్నించగా, అఫిడవిట్ కోసం రూ.300, కుల, ఆదాయం సర్టిఫికెట్ల కోసం రూ.400 అవుతుందని చెప్పి అడిగిన డబ్బులు తీసుకున్నాడు.
షేక్ పేటలోని ఓ మీసేవ సెంటర్లో ఓ మహిళ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం ఈ నెల 6న అప్లయ్ చేయగా, అప్లికేషన్ ఫీజుతో పాటు నోటరీ కోసం అంటూ నిర్వాహకుడు రూ.540 తీసుకున్నాడు. నోటరీ చేయించి అప్లికేషన్ ఫామ్కు పెట్టి ఆఫీసులో తానే సబ్మిట్ చేస్తానని అందుకే అన్ని డబ్బులని నమ్మించాడు.
హైదరాబాద్ సిటీ, వెలుగు: మీ సేవ కేంద్రాల్లో కుల, ఆదాయ, నివాస, బర్త్, డెత్సర్టిఫికెట్ల కోసం వెళ్తే దోచుకుంటున్నారు. టెక్నాలజీతో పౌర సేవలను మరింత సులభతరం చేస్తున్నామంటూ అన్ని సేవలను మీ సేవ కేంద్రాలకు అప్పగించి అధికారులు మాత్రం చేతులు దులుపుకుంటున్నారు. దీంతో నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. కుల, ఆదాయ, నివాస, కుటుంబసభ్యుల ధ్రువీకరణ, ఓబీసీ తదితర సర్టిఫికెట్ల కోసం రూ. 45 చెల్లిస్తే చాలు.
కానీ, ఈ ఫీజు ఎక్కడా తీసుకోవడం లేదు. దాదాపు రూ.500 నుంచి రూ.1000 వరకు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు అప్లై చేసేప్పుడు కాకుండా తిరిగి సర్టిఫికెట్లు ప్రింట్ తీసుకునే టైంలో అదనంగా కలెక్ట్ చేస్తున్నారని దరఖాస్తుదారులు చెప్తున్నారు.
అఫిడవిట్ పేరిట..
క్యాస్ట్, లోకల్, ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ కోసం అఫిడవిట్ సమర్పించాలనే నిబంధనలున్నాయి. అయితే, ఇది హైదరాబాద్ జిల్లా మినహా మిగతా జిల్లాల్లో తప్పనిసరి అనే రూల్స్లేవు. హైదరాబాద్ జిల్లాలో కూడా ఇదివరకు క్యాస్ట్సర్టిఫికెట్ తీసుకొని ఉంటే ఆ సర్టిఫికెట్ ఆధారంగా మళ్లీ అప్లై చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. కానీ, మీ సేవలో మాత్రం అదేమీ కుదరదని, అఫిడవిట్ఖచ్చితంగా కావాల్సిందేనని వందల్లో వసూళ్లు చేస్తున్నారు.
అవసరం లేకున్నా అఫిడవిట్ పేరిట రూ.300 నుంచి రూ.400 తీసుకుంటున్నారు. అఫిడవిట్తో కలిపి కుల, ఆదాయ సర్టిఫికెట్ కోసం రూ.90 తీసుకోవాల్సి ఉండగా రూ.700 దండుకుంటున్నారు. ప్రస్తుతం స్కూల్స్, కాలేజీలు రీ ఓపెన్ కావడంతో సర్టిఫికెట్ల కోసం స్టూడెంట్స్ ఎక్కువగా వస్తున్నారు. ఇదే అదునుగా మీసేవ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.
చార్జీల బోర్డులు ఎక్కడ?
మీ సేవ కేంద్రాల్లో తప్పనిసరిగా సర్వీసులకు సంబంధించిన ధరల పట్టిక(సిటిజన్ చార్ట్) ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, ఎక్కడా స్పష్టమైన సమాచారంతో చార్ట్ ఏర్పాటు చేయడంలేదు. ఒకవేళ చార్ట్పెట్టినా ఆ ధరలు కనిపించకుండా చిన్న అక్షరాలతో మొక్కబడిగా ఏర్పాటు చేస్తున్నారు.
ప్రభుత్వ మీ సేవల్లోనే కరెక్ట్ రేట్లు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్జిల్లాల్లో వెయ్యికి పైగా మీ సేవా కేంద్రాలున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 417 ఉండగా, ప్రభుత్వం తరపున 25 కేంద్రాలున్నాయి. రంగారెడ్డిలో 326 సెంటర్లుండగా, ఆరు ప్రభుత్వ సెంటర్లున్నాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 298 మీ సేవా కేంద్రాలుండగా, 17 ప్రభుత్వ సెంటర్లున్నాయి. ఇందులో ప్రభుత్వ మీ సేవా సెంటర్లలో మాత్రమే నిర్దేశించిన ధరల ప్రకారం తీసుకుంటున్నారు. అదే ప్రైవేట్ మీసేవల్లో మాత్రం దోచుకుంటున్నారు.
1100 కు ఫిర్యాదు చేయండి
మీసేవ నిర్వాహకులు అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని మీ సేవకు సంబంధించిన ఉన్నతాధికారులు చెప్తున్నారు. సెంటర్లలో ఖచ్చితంగా సిటిజన్చార్ట్ ఏర్పాటు చేయాలని, అందులో చెప్పిన ధరలనే తీసుకోవాలంటున్నారు. ఎక్కడైనా ఎక్కువ డబ్బులు తీసుకున్నట్టు దృష్టికి వస్తే డయల్ 1100 లేదా 18004251110 నంబర్కు కాల్ చేసి చెప్పాలంటున్నారు. meesevasupport@telangana.gov.in కు మెయిల్చేసి సమాచారం ఇస్తే యాక్షన్ తీసుకుంటామంటున్నారు.