హైదరాబాద్, వెలుగు: డిజిటల్, సోషల్మీడియా బాధ్యతాయుతంగా పనిచేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. నిజ నిర్ధాణ చేసుకున్నాకే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం సిటిజన్ జర్నలిజం నడుస్తోందని చెప్పారు. ఎండ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సైబరాబాద్ కమిషనరేట్లో ‘డిజిటల్ జర్నలిజం చాలెంజెస్’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టులు సోమశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్టులు, సైబర్క్రైమ్ పోలీసులు, ఐటీ ఎక్స్పర్ట్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రింట్, ఎలక్ట్రానిక్మీడియా తరహాలోనే డిజిటల్ మీడియా ట్రెండ్ పెరిగిపోయిందన్నారు. అయితే కొన్ని విషయాల్లో గాసిప్స్,సెటైర్లు, ఫేక్ న్యూస్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యూస్, లైక్స్, షేర్ల కోసం సెలబ్రెటీలపై సైటర్లు వేస్తూ వార్తలు రాస్తున్నారన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చూడాలన్నారు. సోమశేఖర్, శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. సోషల్మీడియాలో వచ్చే సర్క్యులేట్ వార్తలను తప్పనిసరిగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని చెప్పారు.