
బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఆదివారం విడుదలైంది. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించిన మూవీ టీమ్ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘బాలకృష్ణ గారి కెరీర్లోని గొప్ప సినిమాల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని నిర్మాత నాగవంశీ గారు నమ్మారు. ఆయన నమ్మకం నిజమై ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన టీమ్ వల్లే ఈ అవుట్పుట్ వచ్చింది. తమన్ సంగీతం సినిమాకి మెయిన్ హైలైట్గా నిలిచింది. ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం మనసు పెట్టి సినిమా తీస్తే, తెలుగు ప్రేక్షకులు దానిని గుండెల్లోకి తీసుకుంటారని మరోసారి రుజువైంది’ అని చెప్పాడు.
ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ ‘నా పుట్టినరోజు నాడు విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ఇది నాకు మరచిపోలేని పుట్టినరోజు. ఇంత మంచి సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా’ అని చెప్పింది.
ఈ సంక్రాంతి తమకు మరచిపోలేని బహుమతి ఇచ్చిందని హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా అన్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. పండగ సీజన్ కూడా కావడంతో భారీ వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉంది.ఈ మూవీ సక్సెస్ మీట్ను అనంతపురంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.