
- వాటితో సిమ్ కార్డులు కొని సైబర్ నేరాలు
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల కోసం నేరగాళ్లు ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. చిన్నారుల ఫొటోలు తీసుకుని వాటితో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారని, దాంతో సిమ్ కార్డులు కొని మోసాలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) అధ్యయనంలో ఈ వ్యవహారం బయటపడిందని వెల్లడించారు.
‘టెలికాం సిమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రాడ్స్ -గ్లోబల్ పాలసీ ట్రెండ్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రికమెండేషన్స్’ అంశంపై నిర్వహించిన అధ్యయన నివేదికను ఐఎస్బీ ప్రొఫెసర్లతో కలిసి శిఖా గోయల్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు సిమ్ కార్డులు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
పోగొట్టుకున్న సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అలాంటి సమయంలో బాధితుడు కూడా కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సిమ్ కార్డుల రిజిస్ట్రేషన్ సమయంలో 64.5 శాతం మంది కస్టమర్లు మాత్రమే డిజిటల్ కేవైసీని ఆధార్తో లింక్ చేసుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు.
అలాగే సిమ్ కార్డులు కొనుగోలు చేసే వారి వెరిఫికేషన్లో లోపాలు ఉన్నాయని, ఓటీపీ అథంటికేషన్లోనూ అనేక లోపాలు ఉన్నాయని ఆమె చెప్పారు. కాగా.. నివేదికను రూపొందించడంలో అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెసర్లు మనీశ్ గాంగ్వార్ పాల్గొన్నారు.