
- ఆయనతో పాటు సర్టిఫికెట్ తయారుచేయించిన వ్యక్తి అరెస్ట్
- 17 నకిలీ మార్కుల మెమోలు స్వాధీనం
శంషాబాద్, వెలుగు: అమెరికాలో చదువుకునేందుకు ఓ యువకుడు దొడ్డిదారిని ఎంచుకున్నాడు. ఫేక్ స్టడీ సర్టిఫికెట్లతో ఓసారి అమెరికాకు వెళ్లి వచ్చాడు. మరోసారి అలాగే వెళ్లగా డల్లాస్లో అక్కడి అధికారులకు దొరికిపోయాడు. దీంతో సదరు యువకుడితో పాటు ఆయనకు ఫేక్ సర్టిఫికెట్ విక్రయించిన వ్యక్తిపై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం బీఎన్రెడ్డి నగర్కు చెందిన కాతోజు అశోక్(29) స్థానికంగా ఉన్న టీచర్స్కాలనీలో ధనలక్ష్మి ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ అఫీస్ను 2020 డిసెంబర్లో ప్రారంభించాడు. ఈయనకు కేరళలో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసే ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన సహకారంతో అశోక్ ఫేక్ యూనివర్సిటీలు తయారుచేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి వద్ద రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది.
నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, బ్యాంకు స్టేట్మెంట్లను తయారుచేయడం దిట్ట. ఈ క్రమంలో 2021లో నల్గొండ జిల్లా పారేపల్లిగూడెం గ్రామానికి చెందిన గోపాల్రెడ్డి(28) అనే యువకుడు అశోక్ కన్సల్టెన్సీని ఆశ్రయించాడు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు తనకు డిగ్రీ సర్టిఫికెట్ కావాలని కోరాడు. దీంతో రూ.80 తీసుకున్న అశోక్.. తమిళనాడుకు చెందిన మధురై కామరాజ్ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివినట్లు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ తయారు చేయించి గోపాల్రెడ్డికి ఇచ్చాడు. ఆ సర్టిఫికెట్తో గోపాల్రెడ్డి అమెరికా మిస్సౌరీలోని వెబ్స్టర్ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకొని 2023 సెప్టెంబర్లో అక్కడికి వెళ్లాడు.
15 నెలలు చదువుకుని ఇటీవల ఇండియాకు వచ్చాడు. తిరిగి అమెరికా వెళ్లగా డల్లాస్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్లో అధికారులు సర్టిఫికెట్లను పరిశీలించగా ఫేక్ అని తేలింది. దీంతో గోపాల్రెడ్డి తిరిగి హైదరాబాద్కు చేరుకోగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారించారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో గోపాల్రెడ్డి అమెరికా స్టూడెంట్ వీసా పొందినట్లు గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. గోపాల్రెడ్డి ఇచ్చిన సమాచారంతో ధనలక్ష్మీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అశోక్ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
15 మందిని ఇలాగే..
ఇప్పటి వరకు అశోక్ తన కన్సల్టెన్సీ ద్వారా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి 15 విద్యార్ధులను విదేశాలకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. కన్సల్టెన్సీ నుంచి మధురై కామరాజ్ వర్సిటీ పేరుతో 13 మంది వ్యక్తుల పేర్లతో ఉన్న నకిలీ సర్టిఫికెట్లు, ఓయూకి చెందిన నలుగురు వ్యక్తుల పేర్లతో ఉన్న నకిలీ మార్కుల సర్టిఫికెట్లు దొరికాయి. వాటితో పాటు రూ.10 లక్షలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, స్టాంపులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.