ఫేక్​ సర్టిఫికెట్​తో అమెరికాలో స్టడీ..డల్లాస్​లో అధికారులకు పట్టుబడ్డ నల్గొండ జిల్లావాసి

ఫేక్​ సర్టిఫికెట్​తో అమెరికాలో స్టడీ..డల్లాస్​లో అధికారులకు పట్టుబడ్డ నల్గొండ జిల్లావాసి
  • ఆయనతో పాటు సర్టిఫికెట్​ తయారుచేయించిన వ్యక్తి అరెస్ట్​
  • 17 నకిలీ మార్కుల మెమోలు స్వాధీనం

శంషాబాద్​, వెలుగు: అమెరికాలో చదువుకునేందుకు ఓ యువకుడు దొడ్డిదారిని ఎంచుకున్నాడు. ఫేక్​ స్టడీ సర్టిఫికెట్లతో ఓసారి అమెరికాకు వెళ్లి వచ్చాడు. మరోసారి అలాగే వెళ్లగా డల్లాస్​లో అక్కడి అధికారులకు దొరికిపోయాడు. దీంతో సదరు యువకుడితో పాటు ఆయనకు ఫేక్​ సర్టిఫికెట్​ విక్రయించిన వ్యక్తిపై ఆర్​జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం బీఎన్​రెడ్డి నగర్​కు చెందిన  కాతోజు అశోక్​(29) స్థానికంగా ఉన్న టీచర్స్​కాలనీలో  ధనలక్ష్మి ఓవర్సీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ పేరుతో స్టడీ అబ్రాడ్​ కన్సల్టెన్సీ అఫీస్​ను 2020 డిసెంబర్​లో ప్రారంభించాడు. ఈయనకు కేరళలో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసే ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన సహకారంతో అశోక్​ ఫేక్​ యూనివర్సిటీలు తయారుచేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి వద్ద రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది.

నకిలీ ఎక్స్​పీరియన్స్​ సర్టిఫికెట్లు, బ్యాంకు స్టేట్​మెంట్లను తయారుచేయడం దిట్ట. ఈ క్రమంలో 2021లో నల్గొండ జిల్లా పారేపల్లిగూడెం గ్రామానికి చెందిన గోపాల్​రెడ్డి(28) అనే యువకుడు అశోక్​ కన్సల్టెన్సీని ఆశ్రయించాడు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు తనకు డిగ్రీ సర్టిఫికెట్​ కావాలని కోరాడు. దీంతో రూ.80 తీసుకున్న అశోక్.. తమిళనాడుకు చెందిన మధురై కామరాజ్​ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్​ సైన్స్​ చదివినట్లు ఫేక్​ డిగ్రీ సర్టిఫికెట్​ తయారు చేయించి గోపాల్​రెడ్డికి ఇచ్చాడు. ఆ సర్టిఫికెట్​తో గోపాల్​రెడ్డి అమెరికా మిస్సౌరీలోని వెబ్​స్టర్​ యూనివర్సిటీలో అడ్మిషన్​ తెచ్చుకొని 2023 సెప్టెంబర్​లో అక్కడికి వెళ్లాడు.

15 నెలలు చదువుకుని ఇటీవల ఇండియాకు వచ్చాడు. తిరిగి అమెరికా వెళ్లగా డల్లాస్​ ఎయిర్​పోర్టులో ఇమ్మిగ్రేషన్​ ప్రాసెస్​లో అధికారులు సర్టిఫికెట్లను పరిశీలించగా ఫేక్​ అని తేలింది. దీంతో గోపాల్​రెడ్డి తిరిగి హైదరాబాద్​కు చేరుకోగా శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ఇమ్మిగ్రేషన్​ అధికారులు విచారించారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో గోపాల్​రెడ్డి అమెరికా స్టూడెంట్​ వీసా పొందినట్లు గుర్తించి ఆర్​జీఐఏ పోలీసులకు అప్పగించారు. గోపాల్​రెడ్డి ఇచ్చిన సమాచారంతో ధనలక్ష్మీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అశోక్​ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. 

15 మందిని ఇలాగే..

ఇప్పటి వరకు అశోక్​ తన కన్సల్టెన్సీ ద్వారా ఫేక్​ సర్టిఫికెట్లు తయారు చేసి 15 విద్యార్ధులను విదేశాలకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. కన్సల్టెన్సీ నుంచి మధురై కామరాజ్​ వర్సిటీ పేరుతో 13 మంది వ్యక్తుల పేర్లతో ఉన్న నకిలీ సర్టిఫికెట్లు, ఓయూకి చెందిన నలుగురు వ్యక్తుల పేర్లతో ఉన్న నకిలీ మార్కుల సర్టిఫికెట్లు దొరికాయి. వాటితో పాటు రూ.10 లక్షలు, ఫోన్లు, ల్యాప్​టాప్​లు, స్టాంపులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.