టీచర్లే బ్రోకర్లు : ఫేక్ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

టీచర్లే బ్రోకర్లు : ఫేక్ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

హైదరాబాద్ : నకిలీ సర్టిఫికెట్ల ముఠాల గుట్టు రట్టవుతోంది. పోలీసుల కళ్లు గప్పి సాగుతున్న ఫేక్ సర్టిఫికెట్ల ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకుంటున్నారు. ఎస్ఎస్‍సీ నుంచి పీజీ సర్టిఫికెట్ల వరకు నకిలీలు చేసి అంగట్లో సరుకుగా అమ్ముతున్నారు. ఇలాంటి ముఠాలపై నిఘా పెట్టిన పోలీసులు నెల రోజుల్లో మూడు గ్యాంగులను పట్టుకున్నారు. శుక్రవారం సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన ముగ్గురు సభ్యుల ముఠా నుంచి 100 ఫేక్ సర్టిఫికెట్లు, రూ.30వేల నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

టీచర్లే బ్రోకర్లు

పాతబస్తీకి, బహదూర్ పురకు చెందిన మహ్మద్ రోషన్, మహ్మద్ రఫిక్ మొహియుద్దీన్ (అలియాస్ అర్షద్) ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారు. ఇందులో రోషన్ తాడ్ బన్, కాలాపత్తర్ లో పొలైట్ స్కూల్, హఫీజ్ బాబానగర్ లో క్రిసెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాడు. రఫిక్ అత్తాపూర్ సులేమాన్ నగర్ లోని సన్ సైన్ హై స్కూల్, కాలాపత్తర్ బిలాల్ నగర్ లోని బిలాల్ మోడల్ హై స్కూల్ ఇన్ చార్జిగా పనిచేస్తున్నాడు. వీటితో పాటు ఈ ఇద్దురూ కలిసి కొంతకాలంగా హైదరాబాద్, సైబరాబాద్ లలో మరో మూడు స్కూళ్లను నిర్వహిస్తున్నారు. తమ స్కూల్స్ లో చదివే విద్యార్థులను మంచి మార్కులతో పాస్ చేస్తామంటూ తల్లిదండ్రులను నమ్మించే వారు.

సప్లయ్ ఇలా..

ఇలా కొన్నేళ్లుగా స్కూల్ బిజినెస్ చేస్తున్న రోషన్ కు నాంపల్లి బజార్ ఘట్ కు చెందిన అలీఫ్ ఓవర్ సిస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు మహ్మద్ హబీబ్ పరిచయమయ్యాడు. అప్పటికే హబీబ్ నకిలీ సర్టిఫికెట్లను సప్లయ్ చేస్తున్నాడు. తనతో పరిచయమైన రోషన్ తో టెన్త్ ఫెయిలైన విద్యార్థులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఓపెన్ స్కూల్స్ సర్టిఫికెట్లు అందిస్తానని చెప్పా డు. దీంతో ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. రోషన్, రఫిక్ స్కూళ్లలో చదివే విద్యార్థలతో పాటు ఓల్డ్ సిటీలో చదువుకోని యువకులకు ఎస్ఎస్‍సీ నుంచి డిగ్రీ, ఓపెన్ స్కూల్స్ ఫేక్ సర్టిఫికెట్లను అమ్మేందుకు స్కె చ్ వేశారు. ఇందులో ఎస్ఎస్సీ, ఇంటర్ సర్టిఫికెట్ కోసం రూ.30 నుంచి 40 వేలు వసూలు చేసేవారు. ఇలా వచ్చిన డబ్బులో హబీబ్ కు రూ.10వేలు చెల్లించేవారు.