నాగర్ కర్నూల్‌‌‌‌ జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాల అమ్మకాల జోరు

నాగర్ కర్నూల్‌‌‌‌ జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాల అమ్మకాల జోరు
  • డిండి వాగు పరివాహక గ్రామాలే  లక్ష్యం
  • గ్రామాల్లో నిషేధిత బీటీ పత్తి విత్తనాల అమ్మకాలు
  • దిగుబడి రాని భూములకు నష్టపరిహారం కట్టించిన మధ్య దళారులు
  • షాపుల తనిఖీలకే  పరిమితమైన అధికారులు

నాగర్​ కర్నూల్ , వెలుగు: నాగర్ కర్నూల్‌‌‌‌ జిల్లాలోని డిండి వాగు పరివాహక ప్రాంత పల్లెల్లో విత్తన మాఫియా చెలరేగుతోంది.  సీడ్​ లైసెన్స్​ఉన్న షాపుల్లో కాకుండా గ్రామాల్లో దళారుల ఇళ్లలో నకిలీ విత్తనాలను దళారులు భారీగా డంప్ చేస్తున్నారు. గతేడాది నిషేధిత బీటీ 3 విత్తనాలు అంటగట్టిన దళారులు పంట దిగుబడి రాకపోవడంతో నకిలీ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో హడావిడిగా పొలాలు దున్నించి  రైతులకు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్ట పరిహారం కట్టించారు. 

గతేడాది బిజినేపల్లి మండలం వెలిగొండ కాలనీలో దాదాపు 65 మంది రైతులకు చెందిన 352 ఎకరాల్లో  పత్తి దిగుబడి రాలేదని ఆందోళనకు దిగారు.  దీంతో  కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు అవి నకిలీ విత్తనాలని తేల్చారు. కానీ రైతులకు సాయం అందించే ప్రయత్నం చేయలేదు. బాధిత రైతుల్లో ఐదుగురు కోర్టును ఆశ్రయించగా  వారికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించి రాజీ కుదుర్చుకున్నారు. 

గ్రామాలే టార్గెట్ గా దందా.. 

బిజినేపల్లి, తిమ్మాజీపేట, తాడూరు, ఊర్కోండపేట, జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్​మండలాల పరిధిలో డిండి పరివాహక ప్రాంత గ్రామాల్లో  దళారులు చిన్న, సన్నకారు రైతులకు అప్పు ఇచ్చి నకిలీ  విత్తనాలు అంటగడుతున్నారు. ప్యాకెట్​ పత్తి విత్తనాల ధర రూ.650 నుంచి రూ.800 వరకు ఉండగా సీడ్​ తయారీదారులు, దళారులు, మధ్యవర్తుల పంపకాల తర్వాత  రైతులకు రూ.1000కి అమ్ముతున్నారు. విత్తనాలతో పాటు ఎరువులు, క్రిమిసంహారక మందులు సప్లై చేస్తున్నారు.

 పత్తి పంట దిగుబడి వచ్చిన తర్వాత ఈ దళారులే తక్కవ ధరకు కొంటున్నారు.  కాయలు రాకపోవడం, దిగుబడి తగ్గడం వంటి సమస్యలు వస్తే ఆ భూముల్లో ఎలాంటి  ఆనవాళ్లు లేకుండా దున్నిచ్చి గొర్రు కొట్టిస్తున్నారు.  గతేడాది తాడూరు, తిమ్మాజీపేట, ఊర్కొండ, మిడ్జిల్​ మండలాల్లో ఇలానే చేశారు.  రైతులు నిలదీస్తే పెట్టుబడి నష్టం కింద ఎకరాకు రూ.20వేల వరకు చెల్లించారు. 

మల్లాపూర్​, వెలుగొమ్ముల, రాణిపేట, ఊర్కొండ మండలం మాధారం, గుడిగానిపల్లి, తాడూరు మండలం సిర్సవాడ, పాపగల్, ఆవంచ, బుద్ద సముద్రం కాలనీ, మారేపల్లి,  బిజినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నకిలీ పత్తి విత్తన బాధిత రైతులు ఉన్నారు.  ఒక ఎకరా పత్తి సాగుకు దాదాపు రూ.40 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది.  నకిలీ విత్తనాలతో దిగుబడి రాకపోతే రూ.20 వేలు చేతిలో పెట్టి కనిపించకుండాపోతున్నారు. ఆవంచ పరిసర గ్రామాల్లో గత  నెల 30న  ఓ వ్యక్తి  వద్ద 10  కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి.  ఇక్కడి నుంచి ఏయే గ్రామాలకు బీటీ 3 పత్తి విత్తనాలు సప్లై చేశారనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.  

షాపులకే పరిమితమైన తనిఖీలు

నాగర్​ కర్నూల్​జిల్లాలో సీడ్​ లైసెన్స్​ఉన్న షాపులు చాలా తక్కువ.  సీడ్​ విక్రయ లైసెన్స్​ఉన్న ఫర్టిలైజర్​షాప్స్​లో విత్తనాల ధర అధికంగా ఉంటుంది.  గ్రామాల్లో రైతులకు నకిలీ పత్తి విత్తనాలు దళారులు అమ్ముతుండగా.. అధికారులు మాత్రం ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి.