
- ఏడుగురిని అదుపులోకి తీసుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు
- రూ. 63 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, ఎరువులు స్వాధీనం
వరంగల్, వెలుగు : రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్ముతున్న ముఠాను వరంగల్ జిల్లా పరకాల, గీసుకొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వరంగల్ కమిషనరేట్లో నిర్వహించిన మీటింగ్లో కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన మాచబోయిన తిరుపతి నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నాడని సమాచారంతో అందడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు.
తిరుపతి ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ మెహిదీపట్నంలో నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు తయారు చేసే కంపెనీ, గోడౌన్పై దాడి చేసి రూ.57.44 లక్షల విలువైన విత్తనాలు, ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మల్కాజిగిరికి చెందిన జయదీప్గౌతం, ముద్దంగుల ఆదిత్యతో పాటు చెల్పూర్ పాపయ్యపల్లికి చెందిన అన్నం కుమారస్వామిని అరెస్ట్ చేశారు.
మరో ఘటనలో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ ప్రాంతంలో బైరిరెడ్డి మర్రిరెడ్డి ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేయగా అతడి వద్ద కిలో నకిలీ విత్తనాలు దొరికాయి. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా సంగారెడ్డి జిల్లా చింతల చెరువు గ్రామానికి చెందిన తుమ్మగుండ్ల సందీప్రెడ్డి, తుమ్మగుండ్ల విజయ్ జోసఫ్ ఇండ్లపై దాడి చేసి రూ.6.18 లక్షల విలువైన 166 కిలోల విత్తనాలు, 800 లీటర్ల గడ్డిమందును స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం రెండు ఘటనల్లో రూ.63 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకొని, ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితులను పట్టుకున్న టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, పరకాల, మామునూరు ఏసీపీలు సతీశ్బాబు, వెంకటేశ్, ఇన్ స్పెక్టర్లు బాబులాల్, సార్ల రాజు, రంజిత్, క్రాంతికుమార్ను సీపీ అభినందించారు.
రెండున్నర నెలల్లో రెండుసార్లు అరెస్ట్
నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మే వారిపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తామని సర్కారు పెద్దలు చెబుతున్న మాటలు వాస్తవరూపం దాల్చడం లేదు. దీంతో నకిలీ దందాలో గతంలో అరెస్ట్ అయిన వారు దర్జాగా బయటకు వచ్చి మళ్లీ ఇదే దందా కొనసాగిస్తున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్ముతున్న తొమ్మిది మందిని గ్రేటర్ వరంగల్ పరిధిలోని మట్టెవాడ పోలీసులు మార్చి 22న అరెస్ట్ చేశారు.
ఈ ముఠాలో హైదరాబాద్కు చెందిన ముద్దంగుల ఆదిత్య సైతం ఉన్నాడు. ఇదే వ్యక్తి తాజాగా హైదరాబాద్లో పట్టుకున్న ముఠాలోనూ ఉన్నాడు. గతంలో అరెస్ట్ చేసిన పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేయకపోవడం వల్లే ఈజీగా బయటకు వచ్చిన ఆదిత్య తిరిగి అదే దందాను కొనసాగిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.