హైదరాబాద్​లో ఫ్యామిలీ మిస్సింగ్.. ఆర్థిక ఇబ్బందులే కారణం

హైదరాబాద్​లో ఫ్యామిలీ మిస్సింగ్.. ఆర్థిక ఇబ్బందులే కారణం

ఎల్బీనగర్, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం మిస్సింగ్ అయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. మలక్ పేట్ పరిధిలోని సలీంనగర్‌‌లో నివాసం ఉంటున్న వరాహమూర్తి, దుర్గ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నారు. వరాహమూర్తి వృత్తి రీత్యా గోల్డ్ స్మిత్‌. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేసిన వరాహమూర్తికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. కొడుకు సత్య భైరవతో కలిసి ఓ జ్యువెలరీ షాప్‌లో ఆయన ఉద్యోగం చేస్తున్నారు. తండ్రీకొడుకులు పనిచేస్తూ అప్పులకు వడ్డీలు కడుతూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వీరు ప్రత్యామ్నాయ మార్గం లేక చావుకు సిద్ధపడినట్టు తెలుస్తున్నది. ‘చావు తప్ప వేరే మార్గం లేదు.. క్షమించండి. మా చావుకు ఎవరు బాధ్యులు కారు’ అని ఓ నోట్ రాసి.. ఈ నెల 20న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. సెల్ ఫోన్లు ఇంట్లోనే వదిలేసి, తాళం వేసి కుటుంబం మొత్తం అదృశ్యమైంది. విషయం తెలుసుకున్న కూతురు చాముండేశ్వరి మలక్‌ పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.