ఒకే ఫ్యామిలీలో నలుగురి హత్య.. మర్డర్‌‌కు ముందు బాలికపై రేప్

ఒకే ఫ్యామిలీలో నలుగురి హత్య.. మర్డర్‌‌కు ముందు బాలికపై రేప్

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఘోరం జరిగింది. ఓ దళిత కుటుంబం మొత్తాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. 16 ఏళ్ల బాలిక, పదేళ్ల బాలుడు సహా కుటుంబంలో నలుగురినీ చంపేశారు. గురువారం ఉదయం ఎంతసేపటికీ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో వెళ్లి చూడగా అందరూ రక్తపు మడుగులో విగత జీవులై పడి ఉన్నారని మృతుల బంధువులు చెప్పారు. ఈ హత్యలను చేసింది పొరుగు ఇంట్లోనే ఉండే అగ్రవర్ణ కుటుంబమేనని, హత్య చేసే ముందు బాలికను అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 11 మందిపై గ్యాంగ్ రేప్‌, మర్డర్ కేసు పెట్టారు. పలువురిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ప్రయాగ్‌ రాజ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు పిల్లలతో పాటు వారి 45 ఏళ్ల తల్లి, 50 ఏళ్ల తండ్రి ఉన్నారని చెప్పారు. గొడ్డలి, కత్తులతో దాడి చేసి ఈ హత్యలు చేశారని, ముగ్గురి మృతదేహాలు హాల్‌లో ఉండగా, బాలిక మృతదేహం మాత్రం లోపలి గదిలో ఉందని పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో వేర్వేరు టీమ్స్‌గా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు కఠినంగా శిక్షలు పడేలా చూస్తామని ప్రయాగ్‌రాజ్ పోలీస్ ఉన్నతాధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు.

రెండేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య భూ వివాదాలు

మృతుల ఇంటి పక్కన ఉండే అగ్రవర్ణాల కుటుంబంతో వాళ్లకు కొన్నాళ్లుగా భూ వివాదం ఉందని బాధిత ఫ్యామిలీ బంధువులు చెబుతున్నారు. 2019 నుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయని, రెండు నెలల క్రితం బాధిత కుటుంబంపై దాడికి కూడా పాల్పడ్డారని అన్నారు. అయితే ఈ కేసును తొక్కిపెట్టి, నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 21న వాళ్లు బాధిత కుటుంబం ఇంట్లోకి వచ్చి కొట్టినప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చినా సీఐ పట్టించుకోలేదని, నిందితుల ఇంట్లో కూర్చుని సెటిల్‌మెంట్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. దాదాపు వారం రోజుల పోరాడిన తర్వాత గానీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేదని చెప్పారు. అయితే ఆ తర్వాత నిందితులు కంప్లైంట్ ఇచ్చారని రివర్స్‌ కేసులు కూడా పెట్టారని వివరించారు.