- అందుకే అనుమతి ఇవ్వలేదు
- వెలుగు కథనంపై స్పందించిన సీఎఫ్డబ్ల్యూ కర్ణన్
హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ సెంటర్కు అనుమతి లేదని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్ తెలిపారు. పర్మిషన్ తీసుకో కుండానే గత ప్రభుత్వం ఐవీఎఫ్ సెంటర్ను ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. ఐవీఎఫ్ చేయడానికి అవసరమైన డాక్టర్ (ఎంబ్రియాలజిస్ట్) ను కూడా గత ప్రభుత్వం నియమించలేదని, ఐవీఎఫ్ ప్రక్రియలో ఉపయోగించే రీఏజెంట్స్ను కూడా ఇవ్వలేదన్నారు.
ఇటీవలే ఐవీఎఫ్ సెంటర్ పర్మిషన్ కోసం గాంధీ హాస్పిటల్ దరఖాస్తు చేయగా.. కర్ణన్ తిరస్కరించారు. ఈ అంశంపై సోమవారం ‘వెలుగు’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఎంబ్రియాలజిస్ట్ లేకపోవడం వల్లే ఐవీఎఫ్ సెంటర్కు అనుమతి ఇవ్వలేకపోయమని ‘వెలుగు’ ప్రతినిధికి ఆయన వివరించారు. ఐవీఎఫ్ సెంటర్కు అవసరమైన ఎక్విప్మెంట్ను నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఫండ్స్ నుంచి కొనుగోలు చేసి ఇచ్చామని, కానీ అక్కడ ఎంబ్రియాలజిస్ట్ను నియమించేందుకు ఎన్హెచ్ఎంలో ప్రొవిజన్ లేదన్నారు.
గాంధీ హాస్పిటల్ డెవలప్మెంట్ నిధులతో లేదా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంబ్రియాలజిస్ట్ను నియమించుకోవాల్సి ఉంటుందన్నారు. ఐవీఎఫ్ చేయడానికి అవసరమైన రీఏజెంట్స్ను మెడికల్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి ఇస్తామని ఆయన పేర్కొన్నారు.