తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన భూమి పోతుందని ఆవేదన చెందిన రైతు పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సముద్రాల సమ్మయ్య(40) అనే రైతు నేషనల్ హైవే కింద తన భూమి పోతుందని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. నేషనల్ హైవే కింద 51 గుంటల వ్యవసాయ భూమి పోతుందని ఆవేదన చెందాడు. 

తనకు ఇద్దరు ఆడపిల్లలని, కుటుంబ పోషణ పిల్లల పెళ్లిళ్లు భారమని భావించాడు. దీంతో నిన్న సాయంత్రం పురుగుల మందు తాగాడు సమ్మయ్య. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ సమ్మయ్య చనిపోయాడు. మృతుని భార్య సముద్రాల రాజేశ్వరి ముత్తారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.