- నిరుద్యోగ భృతి లేదు.. ఉద్యోగాల ఊసు లేదు
- సొంత జాగలో డబుల్ బెడ్రూం
- ఇల్లు కట్టుకుంటే 3 లక్షల సాయం
- రెండేండ్లలో 16 జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు
- బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్రావు
- 90 పేజీల బడ్జెట్ స్పీచ్లో పది పేజీలు కేంద్రాన్ని తిట్టడానికే
కొత్తగా ఆకట్టుకునే స్కీములు లేకుండా.. సాదాసీదా బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమలవుతున్న పథకాలకు నిధులు సర్దుబాటు చేసేందుకే ఎక్కువ మొగ్గుచూపింది. రూ. 2 లక్షల 56 వేల 861 కోట్ల భారీ బడ్జెట్లో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల ఊసే లేదు. లక్ష రూపాయల దాకా రైతు రుణమాఫీని సర్కారు మళ్లీ సాగదీసింది. ఈసారి రూ. 75 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామంది. డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీమ్కు ఒక్క పైసా ఇవ్వలేదు. అయితే.. సొంత జాగా ఉన్నోళ్లకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పింది. 57 ఏండ్ల వాళ్లకు అమలు చేస్తామన్న కొత్త ఆసరా పెన్షన్లకు భరోసా దక్కలేదు. ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గానికి 1,500 కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని ప్రకటించింది. బడ్జెట్ స్పీచ్లో కేంద్రంపై నిప్పులు చెరిగేందుకే దాదాపు పది పేజీలు కేటాయించిన రాష్ట్ర సర్కారు.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 60 వేల కోట్లు వస్తాయని అంచనా వేసుకుంది.
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగుల ఆశలపై రాష్ట్ర సర్కారు మరోసారి నీళ్లు చల్లింది. బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా.. ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్త లేదు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు రూ. 3,016 ఇస్తామని హామీ ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. 2019 – 20లో నిరుద్యోగ భృతి కోసం రూ.1,810 కోట్లు కేటాయించింది. కానీ పైసా కూడా విడుదల చేయలేదు. ఆ తర్వాత బడ్జెట్ లో అసలు కేటాయింపులే చేయలేదు. 2021 మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న సంకల్పం తమకుందని, కరోనా కారణంగా ఇవ్వలేకపోయామని, తప్పకుండా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుత బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి తప్పనిసరిగా నిధులు కేటాయిస్తారని అంతా భావించినప్పటికీ ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
త్వరలో జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని, 60 వేల నుంచి 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ బడ్జెట్ ప్రసంగంలో కొత్త ఉద్యోగాల కల్పనపై ఎలాంటి ప్రకటన రాలేదు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 90 పేజీలతో బడ్జెట్ ప్రసంగాన్ని రూపొందించింది. మంత్రి హరీశ్రావు గంట 55 నిమిషాలపాటు ప్రసంగం చదివారు. లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు మోటారు సైకిళ్లు ఇస్తామని, సొంత జాగలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకునే వారికి3 లక్షల సాయం చేస్తామని ప్రకటించారు.
అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉండగా, ఈ ఏడాది, వచ్చేసారి మిగతా16 జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి విడతగా 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 2023లో మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కొత్త మెడికల్కాలేజీల స్థాపనకు రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదిస్తున్నామని వివరించింది. నియోజకవర్గానికి 1,500 మందికి దళితబంధు
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,500 మందికి చొప్పున 17 వేల మందికి ఈ ఏడాది దళితబంధు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సొంత జాగలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షల చొప్పున సాయం అందజేస్తామని చెప్పింది. రాష్ట్రంలో తొలి మహిళా వర్సిటీ, ఫారెస్ట్ వర్సిటీల ఏర్పాటుకు రూ. వంద కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని ప్రకటించింది. రూ.75 వేల లోపు అప్పులున్న రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తామని, ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో రోడ్ల కోసం, గొర్రెల పంపిణీకి రూ.వెయ్యి కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని హరీశ్ చెప్పారు.
కేంద్రంపై విమర్శలు
బడ్జెట్ స్పీచ్లో కేంద్రంపై విమర్శలు గుప్పించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని చెప్పేందుకే దాదాపు పది పేజీల్లో ప్రయత్నం చేసింది. కేంద్రం తీరు కాళ్లల్ల కట్టె పెట్టినట్టు ఉందని విమర్శించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నీతి ఆయోగ్ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదని పేర్కొంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం సెస్సుల రూపంలో దొడ్డిదారిన దండుకుంటోందని ఆరోపించింది. హరీశ్రావు.. కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న పంక్తులు చదువుతున్నప్పుడు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బల్లలు చరిచి మద్దతు ప్రకటించారు.
నిధుల కోసం కేంద్రంతో కొట్లాడ్తం: మంత్రి హరీశ్
నిధుల కోసం కేంద్రంతో కొట్లాడుతామని మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రంపై విమర్శలు చేసి పెద్ద ఎత్తున నిధులు ఆశిస్తున్నారు కదా అనే ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను పట్టించుకోనిదంటూ ఉంటే అది మోడీ సర్కారేనని అన్నారు. వాళ్లు ఇవ్వట్లేదని ఊరుకోబోమని, అడుగుతూనే ఉంటామని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఎవరు వెల్లోకి వచ్చినా మొత్తం సెషన్ నుంచి సస్పెండ్ చేయాలని గత బీఏసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. బీజేపీ పక్షనేత వెల్లోకి వచ్చారు కాబట్టే సెషన్ నుంచి సస్పెండ్ చేశామన్నారు. సస్పెండ్ చేయించుకోవాలనే బీజేపీ ఎమ్మెల్యే వెల్లోకి వచ్చారన్నారు. కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల్లోనే నిరసన తెలిపారని, అందుకే వాళ్లను సస్పెండ్ చేయలేదని అన్నారు. ‘‘రాజ్యసభలో తమ స్థానాల్లో నిరసన తెలిపిన 12 మంది ఎంపీలను మొత్తం సెషన్ నుంచి సస్పెండ్ చేయలేదా? ఢిల్లీకి ఒక న్యాయం. రాష్ట్రానికి ఇంకో న్యాయమా?”అని హరీశ్ ప్రశ్నించారు. బడ్జెట్లో 30కి పైగా కొత్త స్కీములు ప్రవేశపెట్టామని చెప్పారు.
కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి వేముల
శాసన మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. సోమవారం కౌన్సిల్ ప్రొటెం స్పీకర్ అమిన్ ఉల్హసన్ జాఫ్రీ అధ్యక్షతన సమావేశం కాగా.. మంత్రి వేముల బడ్జెట్ను ప్రవేశపెట్టి బడ్జెట్ను చదివారు. కౌన్సిల్ సభ్యులతో పాటు కొత్తగా కౌన్సిల్కు ఎంపికైన, నియామకమైన సభ్యులు మధుసూదనాచారి, ఎల్. రమణ, తక్కళ్లపల్లి రవీందర్, బండా ప్రకాష్, కౌశిక్రెడ్డి, తాత మధు, ఎంసీ కోటిరెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, దండె విఠల్ హాజరయ్యారు.