
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో ఘటన
గజ్వేల్, వెలుగు: పొలంలో ఒంటరిగా పని చేసుకుంటున్న మహిళా రైతును హత్య చేసి, ఆమె మెడలోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. గజ్వేల్ సీఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్ల సత్తమ్మ(70), భర్త కిష్టారెడ్డి చనిపోవడంతో కొడుకుల వద్ద ఉంటూ చేసులో పని చేసేది. రోజూ పొలం వెళ్లి పని చేసుకుని తిరిగి వచ్చేది. పొలం రైల్వే ట్రాక్ పక్కన ఉండడంతో జన సంచారం తక్కువగా ఉంటుంది. మంగళవారం ఆమె పొలంలో పని చేస్తుండగా ఎవరో కత్తితో దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తరువాత మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సత్తమ్మను రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించి, విషయాన్ని అతని కొడుకులకు తెలియజేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.