- సీఎంకు ఎఫ్జీజీ లేఖ
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులపై నమోదవుతున్న ఏసీబీ, విజిలెన్స్ కేసులపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంగళవారం సీఎంకు లేఖ రాశారు. సెక్రటేరియెట్ లో ఏసీబీ, విజిలెన్స్ పెండింగ్ కేసులు చాలా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
ఆర్టీఐ సమాచారం ప్రకారం.. 323 ఏసీబీ కేసులు మొత్తం ఉండగా ఇందులో 5 కేసులు మాత్రమే డిస్పోజ్ అయ్యాయని, ఇందులో 318 కేసులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులు చాలా వరకు10 ఏండ్ల కింద నమోదైనవే ఉన్నాయని తెలిపారు. సెక్రటేరియెట్ లో ఈ కేసులపై చర్యలు తీసుకోవటం లేదని చెప్పారు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన లేక ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతితో ప్రభుత్వానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్న రిపోర్టులు ఏండ్ల తరబడి ఎటువంటి చర్యలు లేక సచివాలయంలో పడి ఉన్నాయని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగస్థులు అవినీతి అధికారుల కొమ్ము కాస్తూ ఏసీబీ మరియు విజిలెన్స్ రిపోర్టులను ఏదో ఒక వంకతో సాగదీసి చివరకు చిన్న పనిష్మెంట్ లేదా కేసు డ్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఏసీబీ విజిలెన్స్ కేసులు తొందరగా పరిష్కారమయ్యేటట్టు చూడాలని సీఎంను కోరారు.
