
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ను సోమవారం కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సందర్శించారు. వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర విభాగాలను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, ఆర్ఎంవోలు, వైద్యాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ ప్రొటోకాల్ను ప్రజలు పాటించేలా ప్రభుత్వం చూడాలన్నారు. గాంధీలో ఖాళీగా ఉన్న ఆర్ఎంవోలు, డాక్టర్లు, నర్సులు, ఇతర పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆధార్ కార్డు ఆధారంగా ఓపీ నమోదు ప్రక్రియ సులభంగా జరుగుతోందన్నారు. కొన్ని ఔట్సోర్సింగ్ కంపెనీలు నెలల తరబడి సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని తమకు సమాచారం ఉందని, సదరు కాంట్రాక్టర్లను పిలిచి జీతాలను వెంటనే ఇప్పించాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
గాంధీలో తరచుగా ఎంఆర్ఐ, ఎక్స్ రే,ఈసీజీ, అల్ర్టా సౌండ్ స్కానింగ్, సీటీ స్కానింగ్, 2డీకో మెషీన్లు మొరయిస్తున్నాయని పలువురు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బీఎస్ఎన్ఎల్ సంస్థకు బిల్లులు చెల్లించకపోవడంతో కొంతకాలంగా ఫోన్లు పనిచేయడం లేదని కిషన్రెడ్డికి చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, బీజేపీ నాయకులు, ఆర్ఎంవోలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.