గాంధీలో పోస్టులు భర్తీ చేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన

గాంధీలో పోస్టులు భర్తీ చేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్​ను సోమవారం కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి సందర్శించారు.  వార్డులు, ఆక్సిజన్​ ప్లాంట్లు, ఇతర విభాగాలను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ రాజకుమారి, ఆర్​ఎంవోలు, వైద్యాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్​ ప్రొటోకాల్​ను ప్రజలు పాటించేలా ప్రభుత్వం చూడాలన్నారు. గాంధీలో ఖాళీగా ఉన్న ఆర్​ఎంవోలు, డాక్టర్లు, నర్సులు, ఇతర పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆయుష్మాన్​ భారత్ పథకం కింద ఆధార్​ కార్డు ఆధారంగా ఓపీ నమోదు ప్రక్రియ సులభంగా జరుగుతోందన్నారు. కొన్ని ఔట్​సోర్సింగ్ కంపెనీలు నెలల తరబడి సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని తమకు సమాచారం ఉందని, సదరు కాంట్రాక్టర్లను పిలిచి జీతాలను వెంటనే ఇప్పించాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. 

గాంధీలో తరచుగా ఎంఆర్​ఐ, ఎక్స్​ రే,ఈసీజీ, అల్ర్టా సౌండ్​ స్కానింగ్​, సీటీ స్కానింగ్​, 2డీకో మెషీన్లు మొరయిస్తున్నాయని పలువురు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బీఎస్​ఎన్​ఎల్​ సంస్థకు బిల్లులు చెల్లించకపోవడంతో కొంతకాలంగా ఫోన్లు పనిచేయడం లేదని కిషన్​రెడ్డికి చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్​రెడ్డి, బీజేపీ నాయకులు, ఆర్​ఎంవోలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.