![మారిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపురేఖలు](https://static.v6velugu.com/uploads/2024/05/finance-minister-nirmala-sitharaman-commented-that-the-countrys-infrastructure-sector-has-picked-up-due-to-pm-modis-personal-monitoring_BXHmRKnFdp.jpg)
- మోదీ పర్సనల్గా మానిటర్ చేయడంతో వేగంగా పూర్తవుతున్న ప్రాజెక్ట్లు
- ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ను గాలికొదిలేసిన కాంగ్రెస్
- ఆరోపించిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ పర్సనల్గా మానిటర్ చేస్తుండడం వలన దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ పుంజుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ను పట్టించుకోలేదని ఆరోపించారు. దేశ ఎకానమీని బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడంపై ఫోకస్ పెట్టిందని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం భారీగా కేటాయింపులు జరుపుతోందని అన్నారు. 2004–2014 మధ్య టైమ్ను యూపీఏ ప్రభుత్వం వేస్ట్ చేసిందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నా పట్టించుకోలేదని నిర్మల ఆరోపించారు.
యూపీఏ టైమ్లో దేశ ఎకానమీ అన్ని వైపుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లు, రైల్వేలు, పవర్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పట్టించుకోలేదు. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందకుండా చేసింది’ అని ఎక్స్లో ఆమె పేర్కొన్నారు. నిర్ణయాలు త్వరగా తీసుకోకపోవడం, అతి ఖర్చులు, ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడం, సరైన టైమ్కి అనుమతులు ఇవ్వకపోవడం వంటివి 2004–2014 మధ్య చూడొచ్చని నిర్మల ఆరోపించారు. కానీ, తమ ప్రభుత్వంలో మార్పు వచ్చిందని, ప్రగతి ప్లాట్ఫామ్ ద్వారా ప్రాజెక్ట్ల ప్రోగ్రస్ను మోదీ పర్సనల్గా గమనిస్తున్నారని వివరించారు.
ఫలితంగా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ సమూలంగా మారిందని అన్నారు. ‘ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న ప్రాజెక్టులు మోదీ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. 43 ప్రగతి మీటింగ్ల ద్వారా రూ.17.36 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన పర్యవేక్షించారు’ అని నిర్మల పేర్కొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు పెంచితే వినియోగం, పెట్టుబడుల ద్వారా కేవలం జీడీపీ మాత్రమే పెరగదని, లాజిస్టిక్ సమస్యలు తొలగిపోయి దీర్ఘ కాలంలో ఎకానమీ మరింత పుంజుకుంటుందని వివరించారు.
దేశంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం చేసే ప్రతి రూపాయి ఖర్చుతో ఎకానమీలో రూ.4.8 ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. అదే యూపీఏ టైమ్లో మొత్తం ఖర్చుల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాటా భారీగా పడిపోయిందని అన్నారు. 2003–04 లో ప్రభుత్వ ఖర్చుల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాటా 23 శాతం ఉంటే, 2005–2014 మధ్య 12 శాతానికి తగ్గిందని చెప్పారు. కాంగ్రెస్ మారిందని చెప్పలేమని, తాజాగా కర్నాటక ప్రభుత్వం తమ 2024 బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాటాను 28 శాతానికి తగ్గించిందని ఆరోపించారు.
ఎన్నో చేశాం..
తమ ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు ప్రాధాన్యం ఇస్తోందని, 2023–24 నాటికి ప్రభుత్వ మొత్తం ఖర్చుల్లో వీటి వాటా 21 శాతానికి పెరిగిందని నిర్మలా సీతారామన్ అన్నారు. 2014 తర్వాత నుంచి ఇప్పటి వరకు రూ.43.53 లక్షల కోట్ల గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ (జీబీఎస్) ను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అందించామని అన్నారు. 2004–14 మధ్య యూపీఏ అందించిన సపోర్ట్తో పోలిస్తే ఇది 3.72 రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 3.74 లక్షల కి.మీ రూరల్ రోడ్లను గత పదేళ్లలో వేశామని, 2014 తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేల కోసం కేటాయింపులు 500 శాతం పెరిగాయని వివరించారు.
నేషనల్ హైవే నెట్వర్క్ గత పదేళ్లలో 60 శాతం పెరిగి 91,287 కి.మీల నుంచి 1,46,145 కి.మీలకు పెరిగిందని అన్నారు. పీఎం మోదీ నాయకత్వంలో ఇండియన్ రైల్వేస్ రూపురేఖలు మారాయని, మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ ట్రైన్స్ అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. రైల్వే క్యాపెక్స్ 2023–24 నాటికి రూ.2.43 లక్షల కోట్లకు చేరుకుందని అన్నారు. పవర్ సెక్టార్ను చూసుకుంటే 193 గిగా వాట్ల కరెంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని యాడ్ చేశామని చెప్పారు.
ఏవియేషన్ సెక్టార్లో 83 కొత్త విమానాశ్రయాలను నిర్మించామని, పనిచేస్తున్న ఎయిర్పోర్టులు గత 10 ఏళ్లలో 74 నుంచి 157 కి చేరుకున్నాయన్నారు. పోర్ట్ అండ్ ఆపరేషన్స్ సెక్టార్లోకి 100 శాతం ఎఫ్డీఐ పెట్టుబడులకు అవకాశం కల్పించామని ఆమె అన్నారు.