
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందని, ప్రభుత్వం వెంటనే దీన్ని బయట పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర సమస్య ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఆరు నెలలు గడిచినా పాలన గాడిలో పడలేదని, కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు.
ఇంటిపన్నును సైతం డ్రా చేసుకోకుండా పంచాయతీలను ఇబ్బంది పెడతున్నారని ఆరోపించారు. జీపీల్లోని సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని, చిన్నచిన్న రిపేర్లకు ఒక్క రూపాయి కూడా అందడం లేదని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఐదు శాతం నిధులు కూడా సంక్షేమానికి ఖర్చు చేయలేదని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పకుండా, ఈ ప్రభుత్వం కూడా దాచి పెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకుని కేంద్రం ఇచ్చిన నిధులను పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.