మరో నలుగురిపైనా నమోదు
ముంబై: ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్యకు కారకులయ్యారనే ఆరోపణలతో మహారాష్ట్రలోని రాయగఢ్ పోలీసులు ఎడల్వీస్ గ్రూపు చైర్మన్ రశేష్ షాతోపాటు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పులు చెల్లించాలంటూ నిందితులు విపరీతంగా ఒత్తిడి తేవడం వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని మృతుడి భార్య పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఖలాపూర్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 34 (ఉమ్మడి ఉద్దేశం) కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఎఫ్ఐఆర్లో ఎడెల్వీస్ ఛైర్మన్ షా, కంపెనీ అధికారి స్మిత్ షా, కెయుర్ మెహతా, ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ఆర్కె బన్సాల్, ఇంటెరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్గా ఎన్సీఎల్టీ నియమించిన జితేందర్ కొఠారీ పేర్లు ఉన్నాయి. నిందితులను విచారణకు హాజరు కావాలని కోరతామని పోలీసులు తెలిపారు. అప్పుల చెల్లింపు విషయంలో తన భర్తను పదే పదే మానసిక వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని నేహా దేశాయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. "లగాన్", "జోధా అక్బర్" వంటి పాపులర్ బాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన దేశాయ్ బుధవారం రాయ్గఢ్ జిల్లాలోని కర్జాత్లో తన స్టూడియోలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లెండర్లకు ఆయన కంపెనీ రూ. 252 కోట్ల లోన్ను తిరిగి చెల్లించకపోయింది. దీంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ దానిపై దివాలా ప్రక్రియను ప్రారంభించింది. దేశాయ్ కంపెనీ ఎన్డీ ఆర్ట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 2016, 2018లో ఎడెల్వీస్ ఫైనాన్స్ నుండి రెండు లోన్ల ద్వారా రూ. 185 కోట్లు అప్పుగా తీసుకుంది. వీటిని 2020 జనవరి నుండి సక్రమంగా చెల్లించలేకపోవడంతో ఆయనకు ఇబ్బందులు మొదలయ్యాయి.