- హైదరాబాద్ అబిడ్స్లోని బచస్ ఫర్నిచర్స్లో ఘోర అగ్ని ప్రమాదం
- -గుర్తుపట్టలేనంతగా కాలిబూడిదైన మృతదేహాలు
- నాలుగు అంతస్తుల బిల్డింగ్లోని రెండు సెల్లార్లలో మంటలు
- మంటల్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ
- వాళ్లను కాపాడేందుకు లోపలికి వెళ్లిన మరో ఇద్దరు
- మంటల్లో చిక్కుకుని వాళ్లు కూడా మృతి
- 10 గంటల పాటు ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్
- దట్టమైన పొగ, మంటలతో లోపలికి వెళ్లలేకపోయిన సిబ్బంది
- షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం
హైదరాబాద్ / బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. అబిడ్స్ నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్ వెళ్లే రోడ్డులోని బచస్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాపులో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ సహా వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు మృతి చెందారు. ప్లాస్టిక్తో నిండిన పొగతో ఊపిరి ఆడక అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, డెడ్బాడీలు గుర్తించలేనంతగా కాలిబూడిదయ్యాయి. ఘటనా స్థలంలో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 10 గంటల పాటు శ్రమించారు. కానీ మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడలేక పోయారు. డెడ్బాడీలను ఆదివారం బయటకు
తీసుకురానున్నారు.
నాలుగు అంతస్తుల భవనంలో బచస్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాపు నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ కింది భాగంలో ఒక్కటే ఎంట్రీ, ఎగ్జిట్తో రెండు సెల్లార్లు ఉన్నాయి. మొదటి సెల్లార్లో వాచ్మెన్ సహా ఫర్నిచర్ షాపులో పని చేస్తున్న నాలుగు కుంటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇందులో కర్నాటకకు చెందిన వాచ్మెన్ బేబీ(43) కుటుంబంతో పాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మాల్కు చెందిన యాదయ్య, ఆయన భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు అఖిల్(12), ప్రణీత్(9)తో కలిసి సెల్లార్లోని రూమ్లో నివాసం ఉంటున్నారు. యాదయ్య అదే షాపులో ఫర్నిచర్ తయారు చేస్తుండగా..లక్ష్మి స్థానికంగా ఇళ్లలో పని చేస్తోంది. అఖిల్ ఆరో తరగతి. ప్రణీత్ రెండో తరగతి చదువుకుంటున్నారు. లక్ష్మి, యాదయ్యలు వారివారి పనులపై వెళ్లగా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో లక్ష్మి ఇంటికి వచ్చింది. చిన్న కొడుకుతో కలిసి పండ్లు తిని తిరిగి పనికి వెళ్లిపోయింది. కాగా, ఇంకో సెల్లార్లో ఫర్నిచర్ షాష్ గోదాం ఉండగా, అందులో మధ్యాహ్నం 12:40 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్, ఫైబర్తో కూడిన ఫర్నిచర్తో పాటు తీవ్రంగా మండే స్వభావం గల కెమికల్స్, లెదర్కు
అంటుకున్నాయి.
సెల్లార్లో బేస్మెంట్లకు డ్రిల్లింగ్ చేసి..
భారీ ఎత్తున దట్టమైన మంటలు ఎగిసిపడడంతో అబిడ్స్ పరిసర ప్రాంతాలు పొగతో నిండిపోయాయి. దీంతో కరెంట్ సప్లయ్ కూడా నిలిపివేశారు. అబిడ్స్– నాంపల్లి రూట్లో ట్రాఫిక్ను ఇతర ప్రాంతాల నుంచి డైవర్షన్ చేశారు. ఓ వైపు మంటలను అదుపు చేస్తూనే, మరోవైపు మహిళ సహా ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. ఫైర్ సిబ్బంది రోబోతో రెస్కూ ఆపరేషన్ చేశారు. కానీ ఫలితం దక్కలేదు. సెల్లార్లోకి వెళ్లేందుకు సవాళ్లు ఎదురుకావడంతో ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించారు. దీంతో సాయంత్రం 7 గంటల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. సెల్లార్ బేస్మెంట్ గోడలకు డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్లారు. కాగా, ఫైర్ ఇంజిన్లు వినియోగించిన నీటితో అప్పటికే సెల్లార్ మొత్తం నిండిపోయింది. దీంతో రెస్కూ ఆపరేషన్ ఆలస్యమైంది. దీనికితోడు ఇరుకైన గల్లీలు, రద్దీగా ఉండే ప్రాంతాలు కావడంతో ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం సవాలుగా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా, హైదరాబాద్ సీపీ సజ్జనార్, కలెక్టర్ హరిచందన, మేయర్ గద్వాల విజయలక్ష్మి రెస్క్యూ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించారు. మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎల్బీనగర్, లక్డీకాపూల్ నుంచి కూకట్పల్లి, మెహిదీపట్నం వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో నాంపల్లి, అబిడ్స్, మొజంజాహీ మార్కెట్, కోఠి పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలో అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డును క్లోజ్ చేసి ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్కు వచ్చే వారు వాయిదా వేసుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు.
కాపాడేందుకు వెళ్లి కాలిపోయారు..
దట్టమైన పొగలతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని బచస్ ఫర్నిచర్ షాపు బయటి భాగంలో ఉన్న ఫర్నిచర్కు వ్యాపించాయి. సెల్లార్లోని మంటల్లో చిక్కుకున్న బేబీ, అఖిల్, ప్రణీత్లు బయటకు రాలేకపోయారు. అదే షాపులో పనిచేస్తున్న నాంపల్లి సుభాన్నగర్కు చెందిన మహ్మద్ ఇంతియాజ్(27), షాపులోని ఫర్నిచర్ తీసుకుపోవడానికి వచ్చిన శాస్త్రిపురానికి చెందిన ఆటో డ్రైవర్ హబీబ్(40) సెల్లార్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సెల్లార్లోకి వెళ్లారు. అప్పటికే సెల్లార్ అంతా భారీ మంటలు, పొగతో నిండిపోయింది. ప్లాస్టిక్, ఫైబర్తో కూడిన దట్టమైన పొగతో ఊపిరి ఆడక ఇంతియాజ్, హబీబ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మంటలను ఆర్పుతూనే ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. గ్రౌండ్ ఫ్లోర్లోని ఇద్దరిని రక్షించారు. కానీ సెల్లార్లోకి వెళ్లలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 8 ఫైర్ ఇంజిన్లతో దాదాపు 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆక్సిజన్ సిలిండర్స్ వినియోగించారు.
