నిర్మల్ జిల్లా బాసరలో బస్సు–టిప్పర్ ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే.. అలాంటిదే మరో ప్రమాదం జరిగింది. బుధవారం (మార్చి 11) సాయంత్రం సిద్ధిపేట జిల్లాలో బస్సు–లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, బస్సు డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీతో ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు.
బస్సులో ప్రయాణిస్తున్న లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రంగు సత్యనారాయణ (85) స్పాట్ లోనే చనిపోయారు. బస్సు డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికుల సమాచారం మేరకు గజ్వేల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
►ALSO READ | హైదరాబాద్లో బయట అల్లం పేస్ట్.. కొనాలనుకోవడమే పాపమైపోయింది.. 675 కిలోల నకిలీ అల్లం పేస్ట్ సీజ్
ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. బస్సు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం జరగటంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
