ఏరువాక పౌర్ణమి.. రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం

ఏరువాక పౌర్ణమి.. రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం

ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం ఉందని, మంచి ఆరుతడి పంటలు వేసి అధికంగా దిగుబడులు సాధించి ఆర్థికంగా బాగుండాలని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ళలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వయంగా నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఏరువాక పౌర్ణమి రోజు తెలంగాణలో వ్యవసాయ ప్రారంభ దినమని మంత్రి తెలిపారు. ఈ సీజన్ లో తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ కూరెళ్ళలో వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. దేశానికే వెన్నెముక అయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తిగా అండగా ఉంటామన్నారు.

ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి అన్ని పంటలు క్రిమి, కీటకాల బెడద లేకుండా సమృద్ధిగా పండాలని, రైతులకు ఆర్థికంగా మంచి రాబడి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి  పొన్నం చెప్పారు.