అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరు మృతి

అమెరికాలోని ఈశాన్య సియాటెల్‌ పట్టణంలో గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దుండగుడు బుధవారం తుపాకీతో వీధిలోకి వచ్చి… మొదట కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే అలర్టైన అక్కడి భద్రతా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తర్వాత అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు అటుగా వస్తున్న మెట్రో బస్సుపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కొద్ది క్షణాల్లోనే తేరుకున్న డ్రైవర్‌ అక్కడి నుంచి బస్సును వేగంగా వేరే ప్రాంతానికి తరలించాడు. దీంతో బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత దుండగుడు మరో కారుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కారు తీసుకొని పారిపోయే ప్రయత్నంలో నిందితుడు మరో వాహనాన్ని వేగంగా వెళ్లి ఢీకొట్టాడు. దీంతో ఆ వాహనంలోని వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలాడు. పోలీసులు అతణ్ని వెంబడించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరపడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.