19 ఏళ్ల ‘కేబీసీ’ చరిత్రలో మొదటిసారి మహిళల కోసం…

19 ఏళ్ల ‘కేబీసీ’ చరిత్రలో మొదటిసారి మహిళల కోసం…

ఎన్నో సంవత్సరాలుగా టెలికాస్ట్ అవుతూ, ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ‘కేబీసీ’ మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అమితాబచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ దేశ వ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందిందో తెలియంది కాదు. బిగ్‌బీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే చాలు కోటి రూపాయలకు పైగా ఈ షో ద్వారా గెలుచుకోవచ్చు. జూలై 3, 2000 సంవత్సరంలో మొదలైన ఈ షో ప్రేక్షకాధరణతో ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ షోను మొదట స్టార్‌ప్లస్ టీవీ యాజమాన్యం మొదలుపెట్టింది. మొదటి మూడు సీజన్‌లు స్టార్‌ప్లస్ యాజమాన్యమే నిర్వహించింది. ఆ తర్వాత నుంచి ప్రస్తుత సీజన్ వరకూ ఈ షోను సోని టీవీ యాజమాన్యం అందిస్తోంది. ఒక బ్రిటీష్ ప్రోగ్రాం ఆధారంగా రూపొందిన ఈ షోకు సంబంధించి సీజన్ 3లో షారుకు ఖాన్ వ్యాఖ్యాత వ్యవహరించారు. మిగిలిన అన్ని సీజన్లకు అమితాబ్ బచ్చనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుత సీజన్ కూడా ఆయనే వ్యాఖ్యాగా వ్యవహరిస్తున్నారు.

‘కేబీసీ’ కి సంబంధించి బిగ్‌బీ ఓ కీలక ప్రకటన చేశారు. ‘కేబీసీ’ చరిత్రలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా ‘లేడీ కేబీసీ’ ని నిర్వహించబోతున్నారట. ఆ షోకు వ్యాఖ్యాతగా సీనియర్ నటి రాధిక వ్యవహరించనున్నారని అమితాబ్ ప్రకటించారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొదటిసారిగా మహిళల కోసం ఓ మహిళ చేత నిర్వహించబోతున్న షోగా ‘కేబీసీ’ చరిత్రలో నిలువనుందని ఆయన అన్నారు. ఈ షోలో పాల్గొనబోయే పోటీదారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా ‘కేబీసీ’ కి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న సీనియర్ నటి రాధికకు ఆయన అభినందనలు తెలిపారు.