మంచిర్యాల జిల్లా: రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా ఈ నెల 14న హైదరాబాద్ కు తరలించారు. అయితే కింగ్ కోటి హాస్పిటల్ లో జాయిన్ చేసుకునే లోపు ఆ మహిళ అంబులెన్స్ లోనే మరణించిందట. చనిపోయాక శాంపిల్ తీసుకున్న వైద్య సిబ్బంది..పరీక్షల అనంతరం శుక్రవారం కరోనా పాజిటివ్ గా నిర్దారణ చేశారు.
కరోనా కేసు మృతి లాగానే మహిళ అంత్యక్రియలు జరిపించిన అధికారులు… ముత్తరావుపల్లి గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. మహిళ కుటుంబ సభ్యులు, అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని బెల్లంపల్లి క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. దీంతో అప్రమత్తమైన అధికారలు ముత్తరావుపల్లిలో హైఅలర్ట్ ప్రకటించారు. గ్రామంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలతో పాటు, ఆమెతో అనుభంధం ఉన్నవారి వివరాలను సేకరించే పనిలో అధికారలు నిమగ్నమయ్యారు.