న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఫిచ్ రేటింగ్స్ పెంచింది. 2026 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు ఈ అంచనా 7.4 శాతంగా ఉంది. 2027లో వృద్ధి 6.7 శాతానికి చేరుతుందని సంస్థ పేర్కొంది.
ఫిచ్ రిపోర్ట్ ప్రకారం.. దేశీయ వినియోగం, పెట్టుబడులు పెరగడం వృద్ధికి ఊతమిస్తుంది. ముడి చమురు ధర 2026 సంవత్సరానికి సగటున 70 డాలర్లుగా ఉండవచ్చు. ఇరాన్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ధరలు 100 డాలర్ల వద్దే నిలిచిపోతే ప్రపంచ సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది.
భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. క్రెడిట్ వృద్ధి రెండంకెల్లో కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం డిసెంబర్ 2026 నాటికి 4.5 శాతానికి చేరవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లను 5.25 శాతం వద్దే కొనసాగించవచ్చు. ప్రపంచ జీడీపీ వృద్ధి 2026లో 2.6 శాతంగా నమోదు కావచ్చని ఫిచ్ వివరించింది
