- ఏటీఎం దహనం కేసులో ఐదుగురి అరెస్టు
మహబూబాబాద్, వెలుగు: ఏటీఎంకు నిప్పు పెట్టి రూ.52,59,500 మాయం చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్జిల్లా కేంద్రానికి చెందిన జడల నాగరాజు ఏటీఎం కస్టోడియన్గా చేస్తున్నాడు. ఇతడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఏటీఎం ఆపరేటర్లు రాజేందర్, ధరావత్ మహేష్తో కలసి ప్లాన్ చేశాడు. ఏటీఎంలలో తక్కువ డబ్బులు ఫిల్ చేసి సాక్ష్యాలను తారుమారు చేయడం కోసం దాసరి కృష్ణ, బి.సాయికుమార్, ఎడ్ల రాంచరణ్, జియశ్వంత్తో రూ. 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 13న జిల్లా కేంద్రంలోని మార్వాడి బజార్లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను తగలబెట్టారు. జడల నాగరాజు రూ.42 లక్షల- వరకు, రాజేందర్ రూ. 9 లక్షలు, ధరావత్ మహేష్ రూ.1.59 లక్షల - వరకు వారి సొంతానికి వాడుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఏటీఎంలలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ ఉండటంతో క్యాష్ ట్యాలీ కాకుండా కప్పిపుచ్చుకోవడం కోసం మెషీన్ తగలబెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నారు. జడల నాగరాజు నుంచి రూ. 23 లక్షల విలువ చేసే రెండు ప్లాట్ల కాగితాలు, రూ.5.9 లక్షల నగదు, గంగరబోయిన యశ్వంత్ వద్ద రూ.30 వేలు, కృష్ణ వద్ద రూ.20 వేలు, సాయికుమార్ వద్ద రూ.15,000, ఎడ్ల రాంచరణ్ వద్ద రూ.15 వేలు సీజ్ చేశారు. నిందితులను పట్టుకోవడంలో చురుకుగా వ్యవహరించిన టౌన్ సీఐ ఎ. వెంకటరత్నం, సీసీఎస్ సీఐ. వెంకటేశ్వరరావును ఎస్పీ అభినందించారు.