మంత్రి పదవి కోసం ఐదుగురు నేతల ప్రయత్నాలు

మంత్రి పదవి కోసం ఐదుగురు నేతల ప్రయత్నాలు
  • దామోదర కోర్ మాదిగ కాదన్న మందుల సామేల్
  • కడియం  శ్రీహరిది ఉప కులమంటూ వెల్లడి
  • తమలో ఎవరో ఒకరికి ఇవ్వాలని ఖర్గేకు లేఖ

హైదరాబాద్: కోర్ మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ కేబినెట్ విస్తరణ సందర్భంగా తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన మాదిగ కాదంటున్నారు ఎమ్మెల్యే మందుల సామేల్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికూడా మాదిగ కాదని, మాదిగ ఉపకులమని చెబుతున్నారు. కోర్ మాదిగలకు మంత్రి వర్గంలో  అవకాశం ఇవ్వాలని కోరుతూ ఐదుగురు ఎమ్మెల్యేలు ఐదుగురు మాదిగ ఎమ్మెల్యేలు  అడ్లూరి లక్ష్మణ్‌(ప్రభుత్వ విప్), మందుల సామేలు, వేముల వీరేశం, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. 

మంత్రివర్గ విస్తరణలో తమ ఐదుగురిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా సమ్మతమేనని స్పష్టంచేశారు. ఎవరికో ఒకరికి కచ్చితంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. తాము తొలినుంచీ కాంగ్రెస్‌కు విధేయులుగా ఉంటున్నామని చెబుతున్నారు. తామే ఒరిజినల్‌  మాదిగ ఎమ్మెల్యేలమంటున్నారు. మాదిగ సామాజిక వర్గ జనాభా రాష్ట్రంలో 2011 జనగణన ప్రకారం 33 లక్షల మంది ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న మాదిగ సామాజిక వర్గం నేతలు రాజయ్యను గోచీ పీకి పంపించారని, మరో నేత కొప్పుల ఈశ్వర్‌ను అవమానించారని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు  న్యాయం చేయాలని అంటున్నారు.

►ALSO READ | పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారంపై మౌనమెందుకు? నాన్చుడు ధోరణిలో ఎమ్మెల్సీ కవిత