గోదావరిఖని/జ్యోతినగర్, వెలుగు : రామగుండం ఎన్టీపీసీలో శనివారం మళ్ళీ ఐదు యూనిట్లను షట్ డౌన్ చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో థర్మల్ విద్యుత్కు డిమాండ్ లేనందున ఎన్టీపీసీ రామగుండం ప్లాంట్ పరిధిలోని 200 మెగావాట్ల 2వ యూనిట్, 500 మెగావాట్ల 4, 5, 7వ యూనిట్లు, ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్ లోని స్టేజ్ 1లో గల 800 మెగావాట్ల 2వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు.
గత శనివారం కూడా ఇదే తరహాలో నేషనల్ గ్రిడ్ నుంచి థర్మల్ విద్యుత్కు డిమాండ్ లేని కారణంగా రామగుండం ఎన్టీపీసీలోని నాలుగు యూనిట్లను షట్ డౌన్ చేశారు. శనివారం, ఆదివారం, సోమవారం ఇదే పరిస్థితి ఉంటుందని, మంగళవారం తిరిగి యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
